Coordinates: 16°06′N 80°48′E / 16.1°N 80.8°E / 16.1; 80.8

భట్టిప్రోలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రెవెన్యూ గ్రామం
పటం
Coordinates: 16°06′N 80°48′E / 16.1°N 80.8°E / 16.1; 80.8
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల జిల్లా
మండలంభట్టిప్రోలు మండలం
Area
 • మొత్తం25.15 km2 (9.71 sq mi)
Population
 (2011)
 • మొత్తం11,092
 • Density440/km2 (1,100/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1010
Area code+91 ( 08648 Edit this on Wikidata )
పిన్‌కోడ్522256 Edit this on Wikidata


భట్టిప్రోలు మహాస్తూపం

భట్టిప్రోలు ఆంధ్ర ప్రదేశ్ లోని బాపట్ల జిల్లాకు చెందిన భట్టిప్రోలు మండలం లోని గ్రామం, అదే పేరు గల మండలానికి కేంద్రం, బౌద్ధ చారిత్రక ప్రదేశం. బౌద్ధచరిత్రకాలంలో దీనిని ప్రతీపాలపురం అనేవారు.

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్రప్రదేశ్ బౌద్ధమత క్షేత్రాల్లో అవశేషపు ధాతువుల పటం

భట్టిప్రోలు ప్రాచీన నామం ప్రతీపాలపురం. ఆంధ్ర శాతవాహనుల కాలంనుండి ఉన్న ప్రముఖ నగరం. శాసనాల ప్రకారం కుబేరకుడు అను రాజు ప్రతీపాలపురంను పాలించాడు. భట్టిప్రోలు ప్రాముఖ్యత, ప్రస్తావన ఆచ్చటి తవ్వకాలలో బయల్పడ్డ బౌద్ధ స్తూపం ద్వారా అంతర్జాతీయ స్థాయికి వెళ్ళాయి. భట్టిప్రోలు ఊళ్ళో ఉన్న చిన్న లంజ దిబ్బ, విక్రమార్క కోట దిబ్బలను తవ్వగా సా.శ.పూ. మూడవ శతాబ్దంలో నిర్మించిన బౌద్ధ స్తూపం కనపడింది.

భట్టిప్రోలు స్తూపం[మార్చు]

సా.శ.పూ. 3వ శతాబ్దికి చెందిన భట్టిప్రోలు స్తూపం చరిత్ర తెలుసుకునేందుకు తొలి నుంచి విదేశీయులే ఆసక్తి కనబరిచారు. సా.శ. 1870లో బోస్‌వెల్‌, 1871లో ఇర్లియట్‌, 1882లో రాబర్టు సెవెల్ ‌లు దీన్ని సందర్శించారు. 1892లో అలెగ్జాండర్ ‌రే ఇక్కడ జరిపిన తవ్వకాల్లో రాతి ధాతు కరండాన్ని కనుగొన్నారు. 1969-70 సంవత్సరాల్లో పురావస్తు శాఖ తరఫున ఆర్‌. సుబ్రహ్మణ్యం తవ్వకాలు జరిపారు. ఒక విహారపు పునాదులు బయటపడ్డాయి. బుద్ధుని తల ప్రతిమ వెలుగు చూసింది. పలు ఇతర వస్తువులు లభ్యమయ్యాయి.[1]

ఇక్కడి స్థూపం వ్యాసం 132 అడుగులు, వేదిక వ్యాసం 148 అడుగులతో ఉంది. 8 అడుగుల ఎత్తు, 8.4 అడుగుల వెడల్పు ప్రదక్షిణా పథం నలుదిక్కులా అయకపు అరుగులు కలిగిన ఈ స్థూపం వాస్తురీత్యా నూతన విషయాలను అందించింది. స్థూప నిర్మాణానికి 45 X 30 X 8 సెంటీమీటర్ల కొలతలున్న ఇటుకలు వాడారు. భట్టిప్రోలు స్థూప తవ్వకాల్లో బయటపడిన ధాతువుల్ని అప్పటి బిట్రీష్‌ ప్రభుత్వం భద్రపర్చింది. శ్రీలంక బౌద్ధ బిక్షువు అనగారిక ధర్మపాలుడు మహాబోధి సొసైటీ ఆఫ్‌ ఇండియాను స్థాపించి, 1920లో కలకత్తాలోని శ్రీధర్మరాజిక విహార్‌లో నిర్మించిన నూతన స్థూపంలో భట్టిప్రోలు బుద్ధ ధాతువులున్న స్ఫటిక పేటికను నిక్షిప్తం చేశాడు.

భట్టిప్రోలు లిపి[మార్చు]

భట్టిప్రోలు లిపిలో ఐదవ శిలామంజూషికపైని పాకృత శాసనాలు (మధ్యవరుసలు మూతరాయిపై, చుట్టూవున్నది గిన్నెరాయిపై )

స్తూపంలో దొరికిన ధాతుకరండంపై మౌర్యకాలపు బ్రాహ్మీ లిపిని పోలిన లిపిలో అక్షరాలున్నాయి.[2] ఈ లిపిని భాషాకారులు భట్టిప్రోలు లిపి అంటారు. దక్షిణ భారతదేశ లిపులన్నియూ ఈ లిపినుండే పరిణామం చెందాయి.[3] బౌద్ధమతంతోబాటు భట్టిప్రోలు లిపి కూడా దక్షిణ ఆసియా ఖండంలో వ్యాపించి బర్మా, మలయా, థాయి, లాఓస్, కాంబొడియా మున్నగు భాషలకు మాతృలిపి అయింది.

స్వాతంత్రోద్యమంలో గ్రామ విశేషాలు[మార్చు]

1942లో కావూరుకు వచ్చిన మహాత్మా గాంధీజీ, భట్టిప్రోలుకు చేరుకున్నాడు. 1917లో స్థాపించిన మారం వెంకటేశ్వరరావు ప్రాథమికోన్నత పాఠశాలలో ఉద్యమకారులతో సమావేశం నిర్వహించారు. ఉద్యమానికి బాసటగా ఆ రోజూలలోనే, ఎవరికి తోచిన రీతిలో వారు, తమ ఒంటిపైన ఉన్న స్వర్ణ, వెండి ఆభరణాలు, నగదు మహాత్మునికి అందించారు. భట్టిప్రోలు నుండి మద్దుల వెంకటగిరిరావు, భార్య రామాయమ్మ నేతృత్వంలో 20 మంది ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం, వెంకటగిరిరావు, రామాయమ్మ లను తమిళనాడులోని రాయవెల్లూరు జైలులో ఉంచింది. గర్భవతియిన రామాయమ్మ, జైలులోనే సూత్రాదేవికి జన్మనిచ్చింది. అప్పటినుండి ఈ గ్రామం ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చింది.

గ్రామ భౌగోళికం[మార్చు]

ఇది సమీప పట్టణమైన రేపల్లె నుండి 15 కి. మీ. దూరంలో ఉంది.

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో కోడిపర్రు, వెల్లటూరు, తాడిగిరిపాడు, పెదపులివర్రు, ఐలవరం గ్రామాలు ఉన్నాయి.

జనగణన విషయాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3145 ఇళ్లతో, 11092 జనాభాతో 2515 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5518, ఆడవారి సంఖ్య 5574. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1627 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 522.[4]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 11382. ఇందులో పురుషుల సంఖ్య 5714, స్త్రీల సంఖ్య 5668,గ్రామంలో నివాస గృహాలు 2817 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 2515 హెక్టారులు.

గ్రామ పంచాయతీ[మార్చు]

భట్టిప్రోలు గ్రామ పంచాయతీ అనేది స్థానిక స్వీయ ప్రభుత్వం. ఈ పంచాయతీ 16 వార్డులుగా విభజించబడి ఉంది. ప్రతి వార్డుకు ఒక ఎన్నికైన వార్డ్ సభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తారు.[5] ఈ వార్డ్ సభ్యులకు, సర్పంచి ప్రాతినిధ్యం వహిస్తారు.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఉంది. సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల రేపల్లెలోను, ఇంజనీరింగ్ కళాశాల తెనాలిలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు తెనాలిలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం తెనాలిలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరు లోనూ ఉన్నాయి.

ఎం.వి.జి.ఆర్.ఆర్. డిగ్రీ కళాశాల[మార్చు]

ఈ కళాశాల ప్రిన్సిపాల్ అయిన డా.మధుసూదనరావు, 29 సంవత్సరాలుగా హిందీ భాషాభివృద్ధికి చేయుచున్న కృషికి గుర్తింపుగా, వీరికి రాష్ట్రస్థాయిలో హిందీ విభాగంలో (వీరొక్కరికే) ఉత్తమ పురస్కారం లభించింది. ఇటీవల గుంటూరులో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా పురస్కారం అందుకున్నాడు.

కె.ఎస్.కె.కళాశాల[మార్చు]

టి.ఎం.రావు ఉన్నత పాఠశాల[మార్చు]

(తమ్మన మల్లిఖార్జునరావు ఎయిడెడ్ ఉన్నత పాఠశాల)

  • ఈ పాఠశాలను తమ్మన మల్లిఖార్జునరావు, 1944లో స్థానికుల సహకారంతో ఏర్పాటుచేసాడు. ఈ పాఠశాలలో చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదిగినారు. ఇప్పుడు ఈ పాఠశాలలో 400 మంది విద్యార్థులు విద్యనభ్యసించుచున్నారు.
  • ఈ పాఠశాలలో చదువుచున్న 8మంది విద్యార్థినులు, 2014,డిసెంబరు-30వ తేదీనాడు, హైదరాబాదులో నిర్వహించు "గురు పురస్కార్" పురస్కారానికి ఎంపికైనారు. ఈ పురస్కారాలకోసం వీరు 2013,డిసెంబరులో తాడికొండలో నిర్వహించిన పరీక్షలలో పాల్గొన్నారు.
  • ఈ పాఠశాల 71వ వార్షికోత్సవం, 2015,ఫిబ్రవరి-25వ తేదీనాడు ఘనంగా నిర్వహించారు.

మారం వెంకటేశ్వర్లు ఎయిడెడ్ ప్రాధమికోన్నత పాఠశాల[మార్చు]

ఈ పాఠశాల వ్యవస్థాపకులు కీ.శే. మారం వెంకటేశ్వర్లు. ఈ పాఠశాల 69వ వార్షికోత్సవం, 2016,జనవరి-28న ఘనంగా నిర్వహించారు.

విశ్వశాంతి పాఠశాల[మార్చు]

ఇటీవల హైదరాబాదులో నిర్వహించిన జాతీయస్థాయి కుంగ్-ఫూ పోటీలలో, అండర్-12 విభాగంలో, ఈ పాఠశాలలో చదువుచున్న జి.రేవంత్ అను విద్యార్థి ప్రథమస్థానం, కె.శిరీష్ అను విద్యార్థి తృతీయస్థానం కైవసం చేసుకున్నారు.

వైద్య సౌకర్యం[మార్చు]

ఒక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఒక ప్రైవేటు వైద్య కేంద్రం ఉంది.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతి పంపుల ద్వారా నీరు అందుతుంది.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

పోస్టాఫీసు సౌకర్యం ఉంది. జాతీయ రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. రైల్వే స్టేషన్ కూడా ఉంది.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. శాసనసభ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.

భూమి వినియోగం[మార్చు]

భట్టిప్రోలులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 219 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 532 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 235 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 369 హెక్టార్లు
  • బంజరు భూమి: 395 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 763 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 395 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 763 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

భట్టిప్రోలులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 763 హెక్టార్లు

మానేపల్లివారి చెరువు[మార్చు]

భట్టిప్రోలు గ్రామ నడిబొడ్డున ఉన్న ఈ చెరువును, నీరు-చెట్టు కార్యక్రమం క్రింద, రు. 3 లక్షల వ్యయంతో పూడికతీసి, చుట్టూ కట్టలను బలపరచి, అభివృద్ధిపరచనున్నారు. దీనికితోడు, గ్రామంలోని, "భట్టిప్రోలు ఫ్రండ్స్ అసోసియేషన్" వారు మరియూ దాతలు, గ్రామస్థుల సహకారంతో చెరువు చుట్టూ ప్రహరీగోడ కట్టి, ఉదయపు నడకకు అనుకూలంగా మార్చెదరు. బోటు షికారు, యోగామందిరం ఏర్పాటుచేయుటకు గూడా ప్రణాళికలు తయారుచేస్తున్నారు. [15]

మౌలిక సదుపాయాలు[మార్చు]

  • ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం
  • ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం:-గ్రామంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయానికీ, శ్రీ షిర్డీ సాయి మందిరానికీ వంశపారంపర్య ధర్మకర్తగా ఉండిన మానేపల్లి లక్ష్మీరామప్రసాదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కావలసిన భూమిని విరాళంగా అందించారు.
  • అంగనవాడీ కేంద్రం.
  • పశు వైద్యశాల.
  • యూనియన్ బ్యాంక్.

ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

పరిశ్రమలు[మార్చు]

హెరిటేజ్ ఫుడ్స్ ఇండియా లిమిటెడ్:- ఈ సంస్థ స్థాపించి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా, ఈ కర్మాగారంలో, 2017,జూన్-9న రజతోత్సవ వేడుకలు నిర్వహించెదరు.

గ్రామంలో జన్మించిన ప్రముఖులు[మార్చు]

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ గుండి పార్వతమ్మ ఆలయం[మార్చు]

భట్టిప్రోలు గ్రామంలో 200 సంవత్సరాల క్రితం వెలిసి, భట్టిప్రోలు మరియూ, చుట్టుప్రక్క గ్రామాల పూజలందుకొనుచున్న, భట్టిప్రోలు గ్రామ దేవత, శ్రీ గుండి పార్వతమ్మ ఆలయం శిథిలమవడంతో, రు. 10 లక్షల వ్యయంతో, ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుచున్నవి. ఉగాది పండుగ పురస్కరించుకొని, అమ్మవారిని, 2014,మార్చి-30, ఆదివారం నాడు, భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. తప్పెట్లతో గ్రామవీధులలో అమ్మవారిని ఊరేగించుచుండగా, భక్తులు హారతులు స్వీకరించారు. తెలుగు సంప్రదాయాలకు ప్రతీకగా, ఉగాదిరోజున భక్తులు ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీ. సోమవారం, ఉగాదినాడు, అమ్మవారిని ఊరేగించిన అనంతరం, దేవాలయ ప్రవేశం చేయించెదరు.

కళ్ళేపల్లి బంగారు మైసమ్మ తల్లి ఆలయం[మార్చు]

భట్టిప్రోలులో రైల్వే గేటు ప్రాంతములో మైసమ్మ తల్లి ఆలయం నిర్మాణం పూర్తి అయినది. 2014, జూలై-27, ఆదివారం నాడు, అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకవాహనంపై తప్పెట్లతో ఊరేగించి, భక్తులనుండి హారతులను స్వీకరించారు. విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా సోమవారం నాడు భక్తులకు అన్న సంతర్పణ నిర్వహించెదరు. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా అమ్మవారు పేరుగాంచడంతో, భక్తుల ఆదరణ ఎక్కువగా ఉంది. ఈ ఆలయంలో 2014, జూలై-29 నాడు, శ్రావణమాసంలో మొదటి మంగళవారం సందర్భంగా, అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. మొక్కుబడులు ఉన్నవారు, అమ్మవారికి పొంగళ్ళు వండి నైవేద్యాలు సమర్పించారు. వచ్చే కార్తీక మాసంలో ప్రతి శుక్రవారం, అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవం, 2015,మే-26వ తేదీ మంగళవారంనాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఉదయం అమ్మవారికి అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి గ్రామోత్సవం కన్నులపండువగా నిర్వహించి, భక్తుల నుండి హారతులు స్వీకరించారు.

శ్రీ భ్రమరాంబా సమేత మల్లేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

1869వ సంవత్సరంలో భటరాజులు దేవస్థానం నిర్మించగా, రాచూరు జమీందారీ వంశీయులు, 12 ఎకరాల మాగాణిభూమిని అందించారు. స్వామివారికి ప్రత్యేకంగా నిర్వహించే రథోత్సవం, ఉత్సవాలకు ఆకర్షణీయంగా నిలిచేది. 1938వ సంవత్సరం నుండి ట్రస్టీల ఆధ్వర్యంలో ఉత్సవాల నిర్వహణ జరిగింది. 1993లో ఈ ఆలయం దేవాదాయశాఖ పరిధిలోనికి రావడంతో, అధికారుల పర్యవేక్షణలో కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నవి. 2001=5లో గ్రామానికి చెందిన శ్రీ కొడాలి శంకరరావు వంశీయులు కోర్టుద్వారా ట్రస్టీలుగా ఏర్పడి, ఉత్సవాల పర్యవేక్షణలో బాధ్యతలు వహించుచున్నారు.

పొన్నమానుసేవ ప్రత్యేకం[మార్చు]

పొన్నమానుసేవ ఉత్సవాలలో ప్రత్యేకతగా నిలుచుచున్నది. గతంలో కాగితం పూలతో పొన్నమాను చెట్టును తయారు చేయించి స్వామివారిని పురవీధులలో ఊరేగించేవారు. అద్దేపల్లికి చెందిన శ్రీ తిరువీధుల యుగంధరరావు కుమారులు, స్వామివారికి స్వామివారికి పొన్నమాను చెట్టుని తయారుచేయించి బహూకరించారు. విద్యుద్దీపాల అలంకరణలో స్వామివారిని ఊరేగించుచూ, భక్తులనుండి హారతులు స్వీకరిస్తారు. కళ్యాణమండపానికి ముందు స్వామివారినీ, అమ్మవారినీ ఎదురెదురుగా ఉంచి, చిచ్చుబుడ్లు వగైరా దీపావళి మందుగుండు సామాగ్రిని భారీగా కాలుస్తూ ఐదురోజులు నిర్వహిస్తారు.

వార్షిక బ్రహ్మోత్సవాలు[మార్చు]

స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం, ఫాల్గుణ మాసంలో 6 రోజులపాటు నిర్వహించెదరు. మొదటి రోజు ఉదయం బిందుతీర్ధం, అభిషేకాలతో ప్రారంభించి సాయంత్రం ధ్వజారోహణ చేస్తారు. రెండవ రోజు అమ్మవారికి పుష్పసేవ నిర్వహించి, అద్దేపల్లి వరకు మేళతాళాలతో ఊరేగింపు నిర్వహిస్తారు. మూడవరోజు పొన్నమాను ఉత్సవం ఉంటుంది. నాల్గవ రోజు ఎదురు కోలు, కనుల పండువగా కళ్యాణం, నిర్వహిస్తారు. ఐదవ రోజు వైభవోపేతంగా, వేలాదిమంది భక్తుల జనసమూహంతో రథోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆరవ రోజున వసంతోత్సవం నిర్వహించి, ధ్వజారోహణతో ఉత్సవాలకు ముగింపు పలుకుతారు.

శ్రీ రామమందిరం[మార్చు]

భట్టిప్రోలు గ్రామంలోని కుమ్మరిగుంటవారి వీధిలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, శ్రీ సీతా, రామచంద్ర, లక్ష్మణ, ఆంజనేయస్వామివారల విగ్రహప్రతిష్ఠా కార్యక్రమం, 2016,ఫిబ్రవరి-14వ తేదీ ఆదివారం, రథసప్తమి పర్వదినంనాడు, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య, వైభవంగా నిర్వహించారు. విగ్రహాలను గ్రామ ప్రధాన వీధులలో ఊరేగించారు. ఈ ఆలయంలో వెలసిన ఆదిన వారి ఇలవేలుపు అయిన గంగమ్మ తల్లికి మూడు సంవత్సరాలకొకసారి కొలుపులు నిర్వహించుచున్నారు. తాజాగా, 2017, ఫిబ్రవరి-12వతేదీ ఆదివారం నాడు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో కొలుపులు నిర్వహించారు. ఉదయమే అమ్మవారిని కృష్ణానదికి తీసుకొని వెళ్ళి పుణ్యస్నానాలు ఆచరింపజేసినారు. స్థానిక రైల్వే గేటు వద్ద నుండి తప్పెట్లతో అమ్మవారికి గ్రామోత్సవం నిర్వంచగా, భక్తులు అమ్మవారికి హారతులు సమర్పించారు.

  • శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం.
  • శ్రీ గంగా పార్వతీ సమేత విఠలేశ్వర స్వామివారి ఆలయం.
  • శ్రీ అయ్యప్పస్వామివారి ఆలయం
  • శ్రీ గంగమ్మ తల్లి ఆలయం

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ఈనాడులో డిసెంబరు 6, 2005న వచ్చిన వార్త
  2. "Ananda Buddha Vihara". Archived from the original on 2007-09-30. Retrieved 2008-03-30.
  3. "The Hindu : Andhra Pradesh / Hyderabad News : Epigraphist extraordinaire". The Hindu. 2007-03-19. Archived from the original on 2007-03-26. Retrieved 2008-03-30.
  4. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  5. "Elected Representatives". National Panchayat Portal. Archived from the original on 21 May 2016. Retrieved 6 May 2016. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 21 సెప్టెంబరు 2016 suggested (help)

వెలుపలి లింకుల[మార్చు]