ఆంధ్రప్రదేశ్ హేతువాద మానవవాద ఉద్యమాల చరిత్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్ర ప్రదేశ్ లో హేతువాద మానవవాద ఉద్యమాల చరిత్ర అనేది రావిపూడి వెంకటాద్రి, పెన్మెత్స సుబ్బరాజు రాసిన పుస్తకం. దీనిని తెలుగు అకాడమీ 2003 లో ప్రచురించింది. ఈ పుస్తకంలోని 9 అధ్యాయాలనుండి స్థూలంగా సమాచారం:

తాత్విక నేపథ్యం[మార్చు]

ప్రకృతి అంతా పరిణామ శీలం, ఒక క్రమంలో జరిగే సంఘటనల మయం. ఆ పరిణామాల క్రమాన్ని గుర్తించడమే హేతువాదం. మనిషిలో చింతనా వ్యవస్థ ఉంది. హేతువాదం కేవలం నాస్తికత్వం, నిరీశ్వరతత్వం కాదు. హేతువాదం హేతువాదమే.దేవుడు లేడనటం, మతాన్ని విమర్శించటమే హేతువాదం కాదు.హేతువాదానికి ప్రాణం స్వేచ్ఛ. హేతువాదం నాస్తికత్వానికీ, భౌతికవాదానికీ, మానవవాదానికీ దారితీయవచ్చు. నియంతృత్వం దానికి గిట్టదు. జ్ఞానం పెరిగినమేరకు హేతువాదం కూడా విస్త్రుతంగా పరిణామం చెందుతుంది. మానవవాదం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజికన్యాయం హేతువాద లక్ష్యాలు. కార్యకారణా సంబంధాన్ని గ్రహించటానికి ప్రతి మనిషీ ప్రయత్నించాలి. మనిషి సత్యాన్ని గ్రహించే కొద్దీ మానవీకరణ పొందుతూ మానవవాదం వైపు నడుస్తాడు. వేలాది ఏళ్ళ క్రితం నుండి మానవుడు తన చుట్టూ ఉన్న ప్రకృతిని చూసి ప్రశ్నల మీద ప్రశ్నలు వేసుకుంటూనే ఉన్నాడు. ప్రతి దానికీ కారణం తెలుసుకుంటూనే ఉన్నాడు. నీరు నిప్పు లాంటి ప్రకృతిశక్తులను వినియోగించుకునే దశకు మానవుడు చేరాడు. సామూహిక గణ జీవితందశ నుండి సొంతకుటుంబం దశకు చేరాడు. దేవుణ్ణి కేంద్రంగా చేసుకొని తరతరాల పాత నమ్మకాలను, మార్చటానికి ప్రయత్నించకూడని మతగ్రంధాలుగా రూపొందించాడు. మతానికేకాక కులానికీ మనిషి భావబానిస అయ్యే స్థితి ఏర్పడింది. సతీసహగమనాలు, బాల్యవివాహాలు, నిర్బంధవైధవ్యాలు, లాంటి మూర్ఖాచారాలు స్త్రీలను వ్యక్తిత్వంలేని వస్తువులుగా మార్చివేశాయి. అంటరానితనం, కులవివక్ష, వర్ణవివక్ష, మనల్ని చీల్చింది. పల్నాటి బ్రహ్మనాయుడు, విలియం బెంటింగ్, రాజారామ్మోహనరాయ్, కందుకూరి వీరేశలింగం లాంటి సంస్కర్తలు ఈ దురాచారాల నిర్మూలనకు కృషిచేశారు. సామాజికన్యాయం మానవహక్కులు కోసం ఉద్యమాలు బయలుదేరాయి. ఈ ఉద్యమాలను బలపరచిన వారందరికీ మతదృష్టి ఉన్నామౌఢ్యాలపట్ల వ్యతిరేకత, హేతువాద మానవవాద న్యాయకాంక్ష కూడా వారిలోఉంది. h

ఆంధ్రలో హేతువాదబీజాలు[మార్చు]

చార్వాకంలో పూర్తిగానూ, జైన బౌద్ధాలలో పాక్షికంగానూ నాస్తిక భౌతికవాద చాయలున్నాయి. ఆంధ్రలో ఈ మతాలు కొంతహేతుబుద్ధిని తెలుగు ప్రజలకు నేర్పాయి. తెలుగునాట హేతువాద బీజాలు వెదజల్లిన తొలి తెలుగు కవి వేమన .మూఢనమ్మకాలను దురాచారాలనువ్యతిరేకించి సర్వమానవ సమానత్వాన్ని మతసామరస్యాన్నీ బోధించినవాడు పోతులూరి వీరబ్రహ్మం (1604-1690). అభ్యుదయ భావాలతో హితసూచని గ్రంథాన్నిరాసిన స్వామినేని ముద్దు నరసింహనాయుడు (1792-1856) తెలుగు హేతువాద వైతాళికుడు. పుదూరు అనంతరామశాస్త్రి, పరవస్తు వెంకటరంగాచార్యులు, కందుకూరి వీరేశలింగం (1848-1919) అంటరానితనం నిర్మూలనకు, వితంతుపునర్వివాహాలకు కృషిచేసారు. కందుకూరి ఆస్తిక హేతువాది. ఆయన మతంలోని మూఢవిశ్వాసాలను పీఠాధిపతుల్నీ విమర్శించాడు. అమావాశ్య రోజునే ఉపాధ్యాయుడిగా చేరాడు. జందెం తీశేశాడు. కృష్ణమిశ్రుడి నాస్తికగ్రంధం ప్రబోధచంద్రోదయాన్నితెనిగించాడు. గురజాడ అప్పారావు (1862-1915) విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని ప్రబోధించిన మానవతావాది, సంస్కర్త.

స్వాభిమాన ఉద్యమాలు[మార్చు]

ఛత్రపతి శివాజీ శూద్రుడు అయినందువల్ల బ్రాహ్మణులు అతని పట్టాభిషేకానికి యాజకత్వం చేయటానికి నిరాకరిస్తారు. అందువలన బ్రాహ్మణేతరులకు పౌరోహిత్యం నేర్పే పాఠశాలలు పెట్టించి, ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్ ఇప్పించాడు. విశ్వబ్రాహ్మణులు కూడా తమకు పౌరోహిత్యం చేసే హక్కు ఉందని పోరాడి కోర్టులోతీర్పు కూడా తెచ్చుకున్నారు (1817). పాలకొల్లులో వైశ్య పండితుడైన మామిడి వెంకయ్య (1764-1834) తరువాత శిల్పులు కూడా యాజకత్వంలో భాగస్వామ్యం కోసం పోరాడారు. పెనుమాక కంసాలి చెర్వుగట్టు రామాచార్యులు ఇప్పటికీ పోరాడుతున్నాడు. సూర్యదేవర రాఘవయ్య చౌదరి బ్రాహ్మణేతర ఉద్యమం (మ.1937) ఆరంభించాడు. జి.యస్.బి.సరస్వతి కొల్లూరు (1916) లోకమ్మ, వెలమ, బలిజ, రెడ్డి కులాలవారు శూద్రులుకాదు సూర్యవంశ క్షత్రియులు అని ప్రకటించాడు. త్రిపురనేని రామస్వామి దుగ్గిరాల రాఘవచంద్రయ్య లాంటి వారు చర్చల్లో విజయం సాధించి యర్రంశెట్టి వీరయ్యనాయుడుకు తొలి జందెం వేశారు. 1917లో బ్రాహ్మణేతర సంఘోద్దేశంతో జస్టిస్ పార్టీ ఏర్పడింది. అర్చకత్వం, పౌరోహిత్యం చేయటం ఈ కులాలవాళ్ళూమొదలు పెట్టారు. ఆర్యసమాజం వీరికి వత్తాసు పలికింది. వీళ్ళందరి పోరాటఫలితంగా 1921లో స్త్రీలకు ఓటు హక్కుకూడా వచ్చింది.

ఆధునిక హేతువాదప్రారంభదశ[మార్చు]

త్రిపురనేనిరామస్వామి (1887-1943), తాపీ ధర్మారావు (1887-1973), గోరా (1902-1975), ఆవుల గోపాలకృష్ణమూర్తి (1917-1966), నార్ల వెంకటేశ్వరరావు (1907-1985), కట్టమంచి రామలింగారెడ్డి, పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, కొప్పరపు సుబ్బారావు, ఆరుద్ర, యలమంచిలి వెంకటప్పయ్య, చలం లాంటివారంతా తెలుగు ప్రజల్లో ఆధునిక హేతువాద ఉద్యమానికి ప్రాణంపోశారు. హేతువాద నాస్తికభావాల ప్రచారమే ప్రధానంగా పెట్టుకోకపోయినా గుర్రంజాషువా, పాలగుమ్మి పద్మరాజు, కొడవటిగంటి కుటుంబరావు, సురమౌళి, మహీధర రామమోహనరావు, సురవరం ప్రతాపరెడ్డి, రాచకొండ విశ్వనాధశాస్త్రి, ఆమంచర్ల గోపాలరావు లాంటివారు హేతువాద భావాలను వారి రచనల్లో బాగా వ్యక్తంచేశారు.

హేతువాద,నాస్తిక సంఘాలు[మార్చు]

1940 లో గోరా ముదునూరులో నాస్తికకేంద్రం స్థాపించారు. 1943లో నాగండ్లలో రావిపూడి వెంకటాద్రి కవిరాజాశ్రమం పేరుతో హేతువాద సఘం స్థాపించారు. 1949లో మద్రాసులో భారత హేతువాద సంఘం ఏర్పడింది. 1972 లో జయగోపాల్ భారత నాస్తిక సమాజం స్థాపించారు. 1976లో అనంతపురంలో డాక్టర్ జె.వెంకట్రామప్ప హేతువాద సంఘం స్థాపించారు. 1978లో రాష్ట్రంలోని హేతువాద సంఘాలన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్ హేతువాదసంఘం గా రూపుదిద్దుకున్నాయి. 1981లో చుక్కపల్లి రామకోటయ్య తెనాలిలో హేతువాద సంఘం స్థాపించారు. 1986లో ఎస్.వి.రావు నరసరావుపేటలో హేతువాదసమాఖ్య స్థాపించారు. భారత నాస్తిక సమాజం నుండి బయటకు వచ్చిన జీడీ.సారయ్య 2010లో "ప్రజా నాస్తిక సమాజం"ను స్థాపించాడు. 2004 జీడీ.సారయ్య స్థాపించిన "సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరెషన్ (ఎస్.ఎస్.ఎఫ్)" సైతం నేడు ఎలుకటూరి అరుణాంక్ అధ్యక్షతన "ప్రజా నాస్తిక సమాజం"కు అనుబందంగా పనిచెస్తున్నది. డా.గురుకుల మిత్రా హేతువాదం,సామ్యవాదాలను కలిపి సమసంగం అనే సంస్తను స్తాపించారు.ఈయన హేతువాదాన్ని విమర్శిస్తూ,రచయిత్రి రంగనాయకమ్మ "నీడతో యుద్ధం" అనే పుస్తకం కూడా వ్రాసేరు.ఇక ముఖ్యంగా కత్తి పద్మారావు హేతువాద ఉద్యమాలను వేలాదిమంది ప్రజలు స్వచందంగా తరలివచ్చే బహిరంగ సభల స్థాయికి తెసుకువెల్లేడు.

ఆంధ్రప్రదేశ్ లో హేతువాద ఉద్యమం[మార్చు]

1930లో బొంబాయిలో స్థాపించబడిన పురోహిత వ్యతిరేక సంఘం రీజన్ (Reason) పత్రిక నడిపేది. దానికి ఎమ్.వి.వి.కే.రంగాచారి కాకినాడ నుండి వ్యాసాలు రాసేవారు. 1962 నుండి హైదరాబాదులో ఆవుల సాంబశివరావు, ఎస్.కె.ఆచార్య, ఎ.ఎల్.నరసింహరావు, ఎన్.ఇన్నయ్యల సారథ్యంలో ది ఇండియన్ రేషనలిస్ట్ (The Indian Rationalist) పత్రిక నడిచింది. 1971 నుండి మద్రాసులో అత్తలూరి సూర్యనారాయణ ఫ్రీ థాట్ (Free Thought) పత్రిక నడిపారు. 1974 నుండి ఎమ్.వి.రామమూర్తి వికాసం, 1976నుండి తోటకూర వెంకటేశ్వర్లు చార్వాక పత్రికలు నడిపారు. 1980 లలో నర్సరావుపేటలో కొందరు మిత్రులు నసీరు, నలినీ మొహన్, పూర్ణానన్దం, తదితరులు యస్.వి.రావు నాయకత్వములో హేతువాద దర్సిని అనే లిఖిత పత్రికను ప్రారంభం చేసారు. ఆ తదుపరి కొద్ది కాలానికే హేతువాదమ్ పత్రిక య.స్.వి.రావు, సంపాదకుడిగా ప్రారంభం అయినది. అనాడు చిత్తజల్లు వరహాలరావు, కత్తి పద్మారావు, ఈశ్వరప్రభు వంటి ప్రముఖ నాస్తికులు వ్యాసాలు వ్రాసి యందరో యువకులను ఆలోచింప చేయడమేగాక, హేతువాద నాస్తికులుగా మారడానికి దోహదపడినారు.

ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘ కార్యకలాపాలు[మార్చు]

  • 1977చీరాలలో జరిగిన జాతీయ సభ తీర్మానాలు:
    • హేతువాదంద్వారా మానవతావిలువలను నిలబెట్టడం
    • తనచేష్టలకు తానే బాధ్యుడనే మానవవాదాన్ని జీవనవిధానంగా చేయటం
    • జాతి మత కుల వర్గ లింగ భేదాలతో చూపే వివక్షను నివారించటం
    • మహిమలను అతీత శక్తులను తిరస్కరించటం
  • 1992నుండి హేమా (హేతువాద మానవవాద ఫౌండేషన్) పబ్లికేషన్స్ వారు 100 పుస్తకాలు ప్రచురించారు.

ఆంధ్రప్రదేశ్ లో మానవవాద ఉద్యమం[మార్చు]

ఎం.ఎన్.రాయ్ 1936 లో ప్రారంభించిన ఇండిపెండెంట్ ఇండియా పత్రిక చదివి ఆంధ్రా యూనివర్శిటీ వైస్ చాన్సలర్ కట్టమంచి, లైబ్రేరియన్ అబ్బూరి రామకృష్ణారావు మానవవాదులయ్యారు. కూచిపూడిలో కోగంటి సుబ్రమణ్యం కోగంటి రాధాకృష్ణమూర్తి లీగాఫ్ రాడికల్ కాంగ్రెస్ మెన్ స్థాపించారు. 1940లో తెనాలి రత్నాటాకీస్ లో రాడికల్ డెమోక్రటిక్ పార్టీ మొదటి సభ జరిగింది. త్రిపురనేని గోపీచంద్ రాయ్ రచనలు అనువదించారు. ఆవులగోపాలకృష్ణమూర్తి గుత్తికొండ నరహరి ఖాజామియా లాంటి ఎందరో ఉద్యమంలో చేరారు. రాడికల్ విహారి ఆంధ్రాలేబర్ లాంటి పత్రికలు నడిచాయి. 1948లో రాడికల్ హ్యూమనిస్ట్ మూవ్ మెంట్ గా పేరుమారింది. రాడికల్ హ్యూమనిస్ట్ సూత్రాలు:

  • వ్యక్తి సుఖజీవనమే సమాజాభివృద్ధికి మూలం
  • స్వేచ్ఛాపిపాస సత్యాన్వేషణ మానవాభ్యుదయానికి మూలం
  • వ్యక్తి స్వేచ్ఛను అడ్డుకొనే ఆటంకాలన్నీ తొలగాలి
  • హేతువాదం జీవి సహజ లక్షణం కర్మసిద్ధాంతం నుండి బయటపడాలి
  • భావాల ఉత్పత్తి పరిసరాల గమనింపుద్వారా ఏర్పడుతుంది
  • సొంతఆస్తిని నిర్మూలించినంతమాత్రాన స్వేచ్ఛరాదు
  • కుల మత మందబలంతో వ్యక్తిస్వేచ్ఛను అడ్డుకుంటే స్వేచ్ఛరాదు
  • భౌతికవాద ప్రజాస్వామ్యంలోనే స్వేచ్ఛ ఉంది
  • రాజకీయ ప్రజాస్వామ్యం ఆర్థికప్రజాస్వామ్యం ఒకదానిమీద ఒకటి ఆధారపడి ఉంటాయి
  • నియంతృత్వం లోనూ సోషలిజంలోనూ ఉన్నత ప్రజాస్వామ్యం రాదు
  • పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కూడా ప్రజలు ప్రభుత్వంపై అజమాయిషీ చేయలేని అశక్తులుగా అవుతున్నారు
  • పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో లిబరలిజం నిరర్ధకమై నవ్వులపాలౌతోంది.
  • మానవ మేదస్సు ఒక ఉత్పత్తి సాధనం.మేధోస్వేచ్ఛా మానవులు పెరిగేకొద్దీ ఉత్పత్తి పెరుగుతుంది
  • ఋణ విముక్తి, విద్య వల్ల వికాసం సామాజిక విప్లవం సిద్దిస్తాయి.
  • దోపిడీ గుత్తపద్ధతులు స్వార్దాలు అంతరించాలి
  • ప్రజాసంఘాలు ప్రభుత్వంలో ప్రత్యక్ష జోక్యం చేసుకోవాలి
  • అధికార కేంద్రీకరణకు స్వేచ్ఛకు పొత్తుకుదరదు.వీలైనంత వికేంద్రీకరణే ప్రజాస్వామ్య లక్ష్యం
  • అధికారంలోకి మానసిక స్వేచ్ఛగలవ్యక్తులోస్తేనే దాస్యశృంకలాలు చేదిస్తారు
  • మానవుడే మానవజాతికి మూలం అన్నిటికీ ప్రమాణం.స్వేచ్ఛాసౌభ్రాతృత్వమానవసమాజం నిర్మిచుకోవాలి

మానవవాదానికి హేతువాదం పట్టుగొమ్మకాబట్టి మానవవాదులంతా హేతువాదాన్నీ ప్రచారం చేస్తున్నారు. తాను స్వేచ్ఛగా భావించిన అంశాలను ఇతరులమీద బలవంతంగా రుద్దటమే నియంతృత్వం. వర్గంపేరుతో స్టాలిన్, జాతిపేరుతో హిట్లర్, మతం పేరుతో ఖొమైనీ ఇలా నియంతృత్వమే చేశారని మానవవాదుల వాదన. నీతి, న్యాయం కులమతాలను బట్టి కాకుండా మానవులందరికీ వర్తించేదిగా ఉండాలి. వ్యక్తి స్వేచ్ఛను సమష్టి కోసం బలి చేయకూడదు. ప్రజాస్వామ్యమంటే నాయకులు కాదు ప్రజలే తమకు తాము స్వాములుగా ఉండటం.

నాస్తిక ,హేతువాద,మానవవాద సాహిత్యం[మార్చు]

నాస్తిక, హేతువాద, మానవతావాద సాహిత్యం తెలుగులో చాలా వచ్చింది. అంబేద్కర్ అభిమానులు అనేకమంది కులనిర్మూలన పై రచనలు చేసి మానవతావాదాన్ని చాటారు. ఇంకొందరుస్త్రీవాద సాహిత్యం వెలువరించారు. దరిమిలా ఇంకా కొందరు రచయితలు వచ్చి ఉండవచ్చు. వారి రచనల వివరాలు ఆయా వ్యక్తుల వ్యాసాలలో చూడవచ్చు:

ఇవి కూడా చూడండి[మార్చు]