నందిని సిధారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నందిని సిధారెడ్డి
సినివారంలో నందిని సిధారెడ్డి
జననంనందిని సిధారెడ్డి
(1955-06-12) 1955 జూన్ 12 (వయసు 69)
బందారం , కొండపాక మండలం, మెదక్ జిల్లా , తెలంగాణ
నివాస ప్రాంతంసిద్ధిపేట ,తెలంగాణ , భారతదేశంIndia
వృత్తితెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ అధ్యాపకుడు
రచయిత
పదవీ కాలం2 మే 2017 - ప్రస్తుతం
మతంహిందూ
భార్య / భర్తమల్లీశ్వరి
పిల్లలువీక్షణ
తండ్రినర్రా బాలసిధారెడ్డి
తల్లిరత్నమాల

నందిని సిధారెడ్డి[1] తెలంగాణ రాష్ట్రానికి చెందిన రచయిత, సామాజిక ఉద్యమకారులు. తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడు.[2]

జీవిత విశేషాలు

మెదక్ జిల్లా బందారం గ్రామంలో 1955లో జన్మించాడు. నందిని సిధారెడ్డి తండ్రి నర్రా బాలసిద్ధారెడ్డి రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్టు యోధుడు[3]. బందారం, వెల్కటూరు, సిద్ధిపేట లలో చదువు ముగించుకుని హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ.పూర్తిచేసి, 'ఆధునిక తెలుగుకవిత్వంలో సూర్యుడు' అనే అంశంపై ఎం.ఫిల్‌ (1981) పట్టా ఆ తర్వాత 'ఆధునిక కవిత్వం, వాస్తవికత - అధివాస్తవికత' పై పరిశోధన చేసి పి.హెచ్.డి (1986) పట్టా పుచ్చుకున్నాడు.

మెదక్‌లో కొంతకాలం పనిచేసి తరువాత సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా పనిచేసి 2012లో పదవీవిరమణ చేశాడు. విద్యార్థి దశనుండే కథలు, కవిత్వం వ్రాశాడు. నవసాహితి, మెదక్ స్టడీ సర్కిల్ అనే సంస్థలను నడిపాడు. గులాబి అనే చిన్నపత్రికను ప్రకటించాడు. మంజీరా రచయితల సంఘం ఏర్పాటు చేసి పలు సాహితీ కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు 'మంజీర' బులెటిన్‌కు సంపాదకత్వం వహించి ఏడు కవితాసంకలనాలను వెలువరించాడు. సోయి అనే పత్రికకు సంపాదకత్వం వహించాడు. 2001లో తెలంగాణ రచయితల వేదికకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించాడు.

1997 ఆగస్టులో కేవలం ఒకేఒక గంట వ్యవధిలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం - ఆవశ్యకతపై సిద్ధారెడ్డి రచించిన కవితే "నాగేటి చాల్లల్ల" కవితగా ప్రసిద్ధి చెందింది. ఈ కవితలో సిధారెడ్డి తెలంగాణ సంస్కృతి మొత్తాన్ని వివరించాడు. ఇదే కవితను "పోరు తెలంగాణ" సినిమాలో పాటగా తీసుకున్నారు.[4] ఈ పాటకు నంది అవార్డు కూడా అందుకున్నాడు. అందెశ్రీ రచించిన జయజయహే తెలంగాణ, గోరటి వెంకన్న రచించిన "గానమా తెలంగాణమా" కవితల కంటే ముందే సిధారెడ్డి తెలంగాణపై కవిత రచించాడు. ఈ కవితలో మొత్తం 10 చరణాలున్నాయి. ఈ కవిత బతుకమ్మ పాటగా తెలంగాణలో ఇంటింటా మారుమ్రోగిపోతోంది.

మే 2, 2017లో ఏర్పడిన తెలంగాణ సాహిత్య అకాడమీ కి తొలి చైర్మన్‌గా నియామకం అయ్యాడు. .[5] [2]

రచనలు

  1. భూమిస్వప్నం
  2. సంభాషణ
  3. ఆధునిక తెలుగుకవిత్వం - వాస్తవికత - అధివాస్తవికత (సిద్ధాంతగ్రంథం)
  4. దివిటీ
  5. ప్రాణహిత
  6. ఒక బాధ కాదు
  7. నది పుట్టుబడి
  8. ఇగురం
  9. ఆవర్థనం
  10. నాగేటి చాల్లల్ల (పాటలు)
  11. ఇక్కడి చెట్లగాలి
  12. చిత్రకన్ను (కథా సంపుటి)

పాటలు

  1. నాగేటి సాల్లల్ల నా తెలంగాణ (పోరు తెలంగాణ-2011)
  2. చెలియా చెలియా విడిపోకే కలలా (2 కంట్రీస్-2017)

పురస్కారాలు

  1. 1986లో భూమిస్వప్నం కవితాసంపుటికి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు
  2. 1988లో భూమిస్వప్నం కవితాసంపుటికి ఇందూరు భారతి వారి దాశరథి అవార్డు
  3. 2001లో ప్రాణహిత కవితాసంపుటికి తెలుగు విశ్వవిద్యాలయం వారి పురస్కారం
  4. 2009లో ఒక బాధకాదు కవితాసంపుటికి విశ్వకళాపీఠం వారి స్నేహనిధి ఉత్తమ కవితా పురస్కారం
  5. 2010లో 'నాగేటి సాలల్లో నా తెలంగాణా' పాటకు ఉత్తమ గేయ రచయితగా నంది పురస్కారం
  6. 2016లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహిత్యంలో విశిష్ట పురస్కారం[6][7]

మూలాలు

  1. పాతికేళ్ళ ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతులు
  2. 2.0 2.1 ఆంధ్రప్రభ. "సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నందిని సిధారెడ్డి". Retrieved 11 May 2017.
  3. http://www.prabhanews.com/medak/article-268306[permanent dead link]
  4. నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మలో కందుకూరి రమేష్‌బాబు రచించిన వ్యాసం, తేది 16-03-2014
  5. నవతెలంగాణ. "రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మెన్‌గా నందిని సిధారెడ్డి నియామకం". Retrieved 11 May 2017.
  6. నమస్తే తెలంగాణతెలుగు (24 November 2016). "నందిని సిధారెడ్డికి తెలుగు వర్సిటీ విశిష్ట పురస్కారం". Retrieved 4 May 2018.
  7. ఆంథ్రజ్యోతి, తెలంగాణ ముఖ్యాంశాలు (3 December 2016). "నందిని సిధారెడ్డికి తెలుగు వర్సిటీ పురస్కారం". Retrieved 4 May 2018.

బయటి లింకులు