దక్కన్ పీఠభూమి

వికీపీడియా నుండి
(దక్కను పీఠభూమి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
దక్కను పీఠభూమి
మహా ద్వీపకల్ప పీఠభూమి (Great peninsular plateau)
తమిళనాడు, తిరువణ్ణామలై వద్ద దక్కను పీఠభూమి
అత్యంత ఎత్తైన బిందువు
ఎత్తు600 m (2,000 ft)
మాతృశిఖరంఅనముడి,
కేరళ
నిర్దేశాంకాలు14°N 77°E / 14°N 77°E / 14; 77
Naming
స్థానిక పేరుదక్కన్, దక్ఖన్, దక్ఖిన్ Error {{native name checker}}: parameter value is malformed (help)

దక్కన్ పీఠభూమి భారతదేశంలోని దక్షిణభాగాన్ని ఆవరించి ఉన్న పెద్ద పీఠభూమి. దీన్నే ద్వీపకల్ప పీఠభూమి, మహాద్వీపకల్ప పీఠభూమి అని కూడా అంటారు.[1] ఎక్కువభాగం రాళ్ళతో కూడుకున్న ఈ పీఠభూమి ఉత్తరభాగాన 100 మీటర్లు (330 అడుగులు), దక్షిణాన 1000 మీటర్లు (3300 అడుగులు), సగటున సుమారు 600 మీటర్లు (2000 అడుగులు) ఎత్తు ఉంటుంది. ఇది పర్వత శ్రేణుల్లో ప్రారంభమై, భారత ఉపఖండంలోని దక్షిణ, మధ్య భాగాల్లో త్రికోణాకృతిలో సముద్రతీరం వరకూ, ఎనిమిది రాష్ట్రాలలో వ్యాపించియున్నది.[2][3] దీనికి పశ్చిమాన పశ్చిమ కనుమలు, తూర్పున తూర్పు కనుమలు సరిహద్దులుగా ఉన్నాయి. ఈ కనుమల మధ్య ఎత్తుగా ఏర్పడిన భూభాగమే ఈ పీఠభూమి. ఈశాన్యాన వింధ్య పర్వతాలు సాత్పురా పర్వతాలు ఉన్నాయి. ఉత్తర పర్వత శ్రేణులు, ఉత్తరాన గల నదీమైదానప్రాంతాలనుండి ఈ పీఠభూమిని వేరు చేస్తున్నాయి. ఈ పీఠభూమి విశాలంగా వ్యాపించియున్న రాష్ట్రాలలో మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణాకు చెందిన భాగాలున్నాయి. ఈ ప్రాంతం భౌగోళికంగా ప్రపంచంలోనే నిలకడ కలిగిన, అధిక విస్తీర్ణంగల,[3] అనేక పెద్ద నదులు గల ప్రాంతం.[2] ఈ పీఠభూముల్లో భారత చరిత్రలో పేర్కొన్న పల్లవులు, శాతవాహనలు, వాకాటక వంశం, చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాదంబ వంశం, కాకతీయులు, ముసునూరి నాయకులు, విజయనగర రాజులు, మరాఠా సామ్రాజ్యం, బహమనీ సుల్తానులు, దక్కన్ సుల్తానులు, హైదరాబాదు నిజాములు రాజ్యాలు ఏర్పాటు చేసుకుని పరిపాలించారు.

పద చరిత్ర[మార్చు]

దక్కన్ పీఠభూమి, హైదరాబాద్, ఇండియా

దక్కన్ (Deccan) అనే పేరు దక్ఖిన్ లేదా దక్ఖన అనే కన్నడ పదాలకు ఆంగ్లరూపం. ఇది సంస్కృతపదమైన దక్షిణ (दक्षिण) నుండి ఆవిర్భవించింది.[4][5][6] ఈ ప్రాంతం భారతదేశంలో దక్షిణంగా ఉండటం వల్ల ఈ పేరు వచ్చింది. తెలుగులో "దక్షిణ", "ఢక్కణ" పేరులు కూడా.[7]

విస్తృతి[మార్చు]

"డెక్కన్" అనే పదం పరిధిలో ఉన్న భౌగోళిక రాజకీయ ప్రాంతం యొక్క చరిత్ర అంతటా వైవిధ్యంగా ఉంది. [8] వర్షపాతం, వృక్షసంపద, నేల రకం లేదా భౌతిక లక్షణాలు వంటి సూచికలను ఉపయోగించి భూగోళ శాస్త్రవేత్తలు ఈ ప్రాంతాన్ని నిర్వచించడానికి ప్రయత్నించారు. [9] ఒక భౌగోళిక నిర్వచనం ప్రకారం, ఇది కర్కట రేఖకు దక్షిణాన ఉన్న ద్వీపకల్ప పీఠభూమి. దీని బయటి సరిహద్దు 300 మీటర్ల ఆకృతి రేఖతో గుర్తించబడింది. ఉత్తరాన వింధ్య - కైమూర్ వాటర్‌షెడ్‌లు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని రెండు ప్రధాన భౌగోళిక-ఫిజియోగ్రాఫిక్ ప్రాంతాలుగా విభజించవచ్చు: సారవంతమైన నల్ల మట్టితో ఒక ఇగ్నియస్ రాక్ పీఠభూమి ఒకటి కాగా, చవుడు ఎర్ర మట్టితో, కొండలతో కూడుకుని ఉన్న నీస్ పెనెప్లైన్ రెండవది. [8]

చరిత్రకారులు డెక్కన్ అనే పదాన్ని భిన్నంగా నిర్వచించారు. ఈ నిర్వచనాల్లో ఒకటి ఆర్.జి.భండార్కర్ (1920) చెప్పిన సన్నటిది - గోదావరి, కృష్ణ నదుల మధ్య ఉన్న మరాఠీ- మాట్లాడే ప్రాంతమే దక్కను పీఠభూమి అని ఇతడు నిర్వచించాడు. మరొకటి, KM పణిక్కర్ (1969) చెప్పే విస్తృతమైన నిర్వచనం - వింధ్యకు దక్షిణాన ఉన్న ద్వీపకల్పం మొత్తమంతా దక్కన్ పీఠభూమే. [10] ఫెరిష్తా (16 వ శతాబ్దం) దక్కన్‌ను కన్నడ, మరాఠీ, తెలుగు భాషలు మాట్లాడేవారు నివసించే భూభాగంగా నిర్వచించాడు. రిచర్డ్ ఎం. ఈటన్ (2005) ఈ ప్రాంతపు భౌగోళిక రాజకీయ చరిత్రను చర్చించేందుకు, ఈ భాషా నిర్వచనాన్నే ఎంచుకున్నాడు. [9] చారిత్రికంగా ఉత్తర రాజ్యాలు, తాము జయించటానికి అనువైన ప్రాంతాన్ని "దక్కన్" అని భావించేలా ఉందని స్టీవర్ట్ ఎన్. గోర్డాన్ (1998) పేర్కొన్నాడు: దక్కన్ యొక్క ఉత్తర సరిహద్దు, ఉత్తర సామ్రాజ్యాల దక్షిణ సరిహద్దును బట్టి, ఉత్తరాన తపతి నది నుండి గోదావరి నది వరకు వివిధాలుగా ఉంది. అందువల్ల, మరాఠాల చరిత్ర గురించి చర్చిస్తున్నప్పుడు గోర్డాన్, దక్కన్‌ను "రిలేషనల్ పదం"గా ఉపయోగిస్తాడు, దీనిని "ఉత్తరాన ఉన్న రాజ్యపు దక్షిణ సరిహద్దుకు ఆవల ఉన్న భూభాగం దక్కన్" అని నిర్వచించాడు.[11]

భౌగోళికం[మార్చు]

ప్రధాన నగరాలు, పట్టణాల స్థానాలను చూపించే దక్కన్ ద్వీపకల్పపు స్థలాకృతి పటం.
హోగెనకల్ జలపాతం, తమిళనాడు
తిరువణ్ణామలై కొండను దక్కన్ పీఠభూమి యొక్క దక్షిణ కొనగా, తిరువణ్ణామలై నగరాన్ని తమిళనాడు వద్ద గేట్వే ఆఫ్ దక్కన్ పీఠభూమిగా పిలుస్తారు
హంపి దగ్గర , కర్ణాటక
మహారాష్ట్రలో దక్కన్ ట్రాప్స్

దక్కన్ పీఠభూమి అనేది గంగా మైదానాలకు దక్షిణంగా, అరేబియా సముద్రానికి,బంగాళాఖాతానికీ మధ్య ఉన్న భౌగోళికంగా వైవిధ్యభరితమైన ప్రాంతం. సాత్పురా శ్రేణికి ఉత్తరాన ఉన్న ఒక గణనీయమైన ప్రాంతం కూడా ఇందులో భాగమే. ఈ సాత్పురా శ్రేణి ఉత్తర భారతదేశాన్ని, దక్కన్‌నూ ఇది విభజిస్తుందని ప్రసిద్ధి చెందింది. పీఠభూమి తూర్పు, పశ్చిమ సరిహద్దుల్లో తూర్పు పడమటి కనుమలు ఉన్నాయి. దాని ఉత్తర హద్దు వింధ్య పర్వతాలు. దక్కన్ పీఠభూమి సగటు ఎత్తు సుమారు 600 మీ. సాధారణంగా పడమర నుండి తూర్పు వైపుకు వాలి ఉంటుంది. దాని ప్రధాన నదులు, గోదావరి, కృష్ణ, కావేరి, పశ్చిమ కనుమల నుండి తూర్పు వైపు బంగాళాఖాతం లోకి ప్రవహిస్తున్నాయి. తమిళనాడులోని తిరువణ్ణామలైని దక్కన్ పీఠభూమి దక్షిణ ద్వారంగా పరిగణింస్తారు..

పశ్చిమ కనుమల పర్వత శ్రేణి చాలా భారీగా ఉండి, నైరుతి రుతుపవనాల నుండి తేమను దక్కన్ పీఠభూమికి రాకుండా అడ్డుకుంటుంది. అందువలన ఈ ప్రాంతం చాలా తక్కువ వర్షపాతం పొందుతుంది.[12][13] తూర్పు దక్కన్ పీఠభూమి భారతదేశపు ఆగ్నేయ తీరంలో, తక్కువ ఎత్తులో ఉంది. దాని అడవులు కూడా సాపేక్షంగా పొడిగా ఉంటాయి, కాని అవి వర్షపు నీటిని నిలిపి, నదులలోకి ప్రవహించేలా చేస్తాయి. ఇవి బేసిన్ల గుండా ప్రవహిస్తూ తరువాత బంగాళాఖాతంలో కలుస్తాయి.[14][15]

చాలా దక్కన్ పీఠభూమి నదులు దక్షిణానికి ప్రవహిస్తున్నాయి. పీఠభూమి యొక్క ఉత్తర భాగంలో చాలా భాగం గోదావరి, దాని ఉపనదులు పశ్చిమ కనుమల నుండి ప్రారంభమై తూర్పు వైపు బంగాళాఖాతం వైపు ప్రవహిస్తున్నాయి. పీఠభూమి మధ్యభాగంలో చాలా భాగం తుంగభద్ర, కృష్ణ, దాని ఉపనదులు, భీమా నదితో సహా, తూర్పుకు ప్రవహిస్తాయి . పీఠభూమి యొక్క దక్షిణ భాగంలో కావేరి నది పారుతుంది, ఇది కర్ణాటక పశ్చిమ కనుమలలో ఉద్భవించి దక్షిణానికి తిరిగి, శివనసముద్ర ద్వీప పట్టణం వద్ద ఉన్న నీలగిరి కొండల గుండా వెళుతుంది. హోగెనకల్ జలపాతం వద్ద తమిళనాడులోకి ప్రవేశిస్తుంది. మెట్టూరు ఆనకట్ట ద్వారా చివరకు బంగాళాఖాతంలో కలుస్తుంది.[16]

పీఠభూమికి పశ్చిమ అంచున సహ్యాద్రి, నీలగిరి, అనిమలై, ఎలమలై కొండలు ఉన్నాయి. వీటిని సాధారణంగా పశ్చిమ కనుమలు అని పిలుస్తారు. అరేబియా సముద్ర తీరం వెంట నడిచే పశ్చిమ కనుమల సగటు ఎత్తు దక్షిణం వైపు పోయే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. సముద్ర మట్టానికి 2,695 మీటర్ల ఎత్తున ఉన్న కేరళలోని అనిముడి శిఖరం ద్వీపకల్ప భారతదేశంలోని ఎత్తైన శిఖరం. నీలగిరిలో దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ హిల్ స్టేషన్ ఊటీ ఉంది. పశ్చిమ తీర మైదానం అసమానంగా ఉంది. దాని గుండా వెళ్ళే నదులు వేగంగా ప్రవహిస్తాయి. ఇవి అందమైన మడుగులను, బ్యాక్ వాటర్లను ఏర్పరుస్తాయి. వీటికి ఉదాహరణలు కేరళ రాష్ట్రంలో చూడవచ్చు. తూర్పు తీరం వెడల్పుగా, గోదావరి, మహానది, కావేరి నదులచే ఏర్పడింది. భారత ద్వీపకల్పానికి పశ్చిమాన అరేబియా సముద్రంలో లక్షద్వీప్ ద్వీపాలు ఉన్నాయి. తూర్పు వైపున బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి.

తూర్పు డెక్కన్ పీఠభూమిని తెలంగాణ, రాయలసీమ అని పిలుస్తారు. ఇది భారీ గ్రానైట్ శిల యొక్క విస్తారమైన పలకలతో కూడుకుని ఉంటుంది. ఇది వర్షపునీటిని సమర్థవంతంగా ట్రాప్ చేస్తుంది. నేల యొక్క సన్నని ఉపరితల పొర కింద, చొరబడని బూడిద గ్రానైట్ బెడ్‌రాక్ ఉంటుంది. కొన్ని నెలల్లో మాత్రమే ఈ ప్రాంతంలో వర్షం పడుతుంది.

దక్కన్ పీఠభూమి యొక్క ఈశాన్య భాగంలో తెలంగాణ పీఠభూమి ఉంది. ఇది సుమారు 148,000 కిమీ 2 విస్తీర్ణంతో ఉంది. ఉత్తర-దక్షిణంగా దీని పొడవు 770 కి.మీ., తూర్పు-పడమరలుగా వెడల్పు 515 కి.మీ.ఉంటుంది.

గోదావరి నది, ఆగ్నేయ దిశగా ప్రయాణిస్తూ; పీఠభూమి నీటిని కలుపుకుని పారుతుంది. పెనెప్లైన్‌ను రెండు ప్రాంతాలుగా విభజిస్తూ ప్రవహించే కృష్ణానది, పెన్నానదులు కూడా పీఠభూమి నీటిని కలుపుకుని ప్రవహిస్తాయి. పీఠభూమి లోని అడవులు -తేమ ఆకురాల్చేవి, పొడి ఆకురాల్చేవి, ఉష్ణమండల ముళ్ళపొదలు.

ఈ ప్రాంత జనాభాలో ఎక్కువ మంది వ్యవసాయంలో నిమగ్నమై ఉన్నారు; తృణధాన్యాలు, నూనెగింజలు, పత్తి, పప్పుధాన్యాలు (చిక్కుళ్ళు) ప్రధాన పంటలు. పోచంపాడు, భైరవానితిప్ప, ఎగువ పెన్నాతో సహా బహుళార్ధసాధక నీటిపారుదల, జలవిద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. పరిశ్రమలు ( హైదరాబాద్, వరంగల్, కర్నూలులో ఉన్నాయి) పత్తి వస్త్రాలు, చక్కెర, ఆహార పదార్థాలు, పొగాకు, కాగితం, యంత్ర పరికరాలు, ఔషధాలను ఉత్పత్తి చేస్తున్నాయి. కుటీర పరిశ్రమలు అటవీ ఆధారితమైనవి (కలప, కట్టెలు, బొగ్గు, వెదురు ఉత్పత్తులు), ఖనిజ ఆధారితమైనవి (ఆస్బెస్టాస్, బొగ్గు, క్రోమైట్, ఇనుము ధాతువు, మైకా, కైనైట్).

ఒకప్పుడు పురాతన ఖండం గోండ్వానాలాండ్ లో భాగంగా ఉన్న ఈ భూమి, భారతదేశంలోకెల్లా పురాతనమైనది, స్థిరంగా ఉన్నదీను. దక్కన్ పీఠభూమిలో పొడి ఉష్ణమండల అడవులు ఉన్నాయి, ఇక్కడ కాలానుగుణ వర్షపాతం మాత్రమే ఉంటుంది.

దక్కన్ లోని పెద్ద నగరాలు హైదరాబాద్, బెంగళూరు, పూణే, నాసిక్. ఇతర ప్రధాన నగరాల్లో కర్ణాటకలోని మైసూర్, గుల్బర్గా, బళ్లారి ఉన్నాయి; మహారాష్ట్రలోని సతారా, అమరావతి, అకోలా, కొల్హాపూర్, లాటూర్, నాందేడ్, సాంగ్లి, ఔరంగాబాద్; తమిళనాడులో హోసూర్, కృష్ణగిరి, తిరువణ్ణామలై, వెల్లూరు, అంబూర్, ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి, విశాఖపట్నం, కర్నూలు, అనంతపురం, రాజమండ్రి, ఏలూరు, తెలంగాణలో వరంగల్, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, సూర్యపేట, సిద్దిపేట, జమ్మికూంట, మహబూబ్ నగర్

శీతోష్ణస్థితి[మార్చు]

ఈ ప్రాంతపు శీతోష్ణస్థితి ఉత్తరాన పాక్షిక శుష్క నుండి ఉష్ణమండల వరకు మారుతూ ఉంటుంది. వర్షాకాలంలో జూన్ నుండి అక్టోబరు వరకు వర్షాలు పడతాయి. మార్చి నుండి జూన్ వరకు చాలా పొడిగా, వేడిగా ఉంటుంది, ఉష్ణోగ్రతలు 40 °C కంటే ఎక్కువగా ఉంటాయి. పీఠభూమి యొక్క శీతోష్ణస్థితి తీరప్రాంతాల కంటే పొడిగా ఉంటుంది. కొన్ని ప్రదేశాలలో శుష్కంగా ఉంటుంది. నర్మదా నదికి దక్షిణంగా భారతదేశం మొత్తం దక్కను పీఠభూమే అని కొన్నిసార్లు అర్ధం ఉన్నప్పటికీ, డెక్కన్ అనే పదానికి నర్మద, కృష్ణ నదుల మధ్య ద్వీపకల్పంలోని ఉత్తర భాగంలో గొప్ప అగ్నిపర్వత నేలలు, లావాతో కప్పబడిన పీఠభూములతో సంబంధం ఉంది.

భూగర్భ శాస్త్రం[మార్చు]

ప్రజలు[మార్చు]

దక్కన్ అనేక భాషలకు, ప్రజలకూ నిలయం. భిల్లులు, గోండులూ పీఠభూమి ఉత్తర, ఈశాన్య అంచుల వెంట కొండలలో నివసిస్తున్నారు. వీళ్ళు ఇండో-ఆర్యన్, ద్రావిడ భాషల కుటుంబాలకు చెందిన వివిధ భాషలను మాట్లాడతారు. ఇండో-ఆర్యన్ భాష అయిన మరాఠీ, వాయవ్య దక్కన్ లోని మహారాష్ట్రలో ప్రధాన భాష. ద్రావిడ భాషలు తెలుగు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల లోను, కన్నడ భాష కర్ణాటక లోను మాట్లాడతారు. హైదరాబాద్ నగరం దక్కన్ లోని ఉర్దూ భాష యొక్క ముఖ్యమైన కేంద్రం; దాని పరిసర ప్రాంతాల్లో కూడా ఉర్దూ మాట్లాడేవారి జనాభా ఉంది. ఈ ప్రాంతంలో మాట్లాడే ఉర్దూ భాషను దక్కనీ అంటారు. దక్కన్ యొక్క దక్షిణ భాగాలలో, తమిళనాడు రాష్ట్రం విస్తరించిన ప్రాంతాలలో తమిళం మాట్లాడుతారు. దక్కన్ ఈశాన్య భాగంలో ఒడిశా రాష్ట్రం ఉంది. ఇక్కడ మరొక ఇండో-ఆర్యన్ భాష అయిన ఒడియా మాట్లాడతారు.

ప్రధాన పంట పత్తి. చెరకు, వరి, ఇతర పంటలు కూడా పండిస్తారు.

చరిత్ర[మార్చు]

భారతదేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన రాజవంశాల్లో కొన్ని డెక్కన్ ప్రాంతంలో ఉద్భవించాయి. చోళులు, పల్లవులు, శాతవాహనులు, వాకాటకులు, కదంబ వంశం, చాళుక్యులు, రాష్ట్రకూటులు, పశ్చిమ చాళుక్య సామ్రాజ్యం, విజయనగర సామ్రాజ్యం, మరాఠా సామ్రాజ్యం మొదలైనవి వీటిలో కొన్ని. తొలి చరిత్రలో, మౌర్య సామ్రాజ్యం (క్రీ.పూ. 300) విస్తరించింది. ఆ తరువాత దక్కన్‌ను శాతవాహన రాజవంశం పాలించింది. ఇది సిథియన్ ఆక్రమణదారులైన వెస్ట్రన్ సాత్రప్‌లకు వ్యతిరేకంగా దక్కన్‌ను రక్షించింది.[17] దక్కనులో వర్ధిల్లిన ప్రముఖ రాజవంశాలు: చోళులు (12 వ శతాబ్దం AD కు 3 వ శతాబ్దం BC), చాళుక్యులు (12 వ శతాబ్దాల వరకు 6 వ), రాష్ట్రకూటులు (753-982), హొయసలులు (14 వ శతాబ్దాల 10 వ), కాకతీయులు (1083 1323 కు AD), కమ్మ నాయకులు (సా.శ. 13 నుండి 17 వ శతాబ్దం), విజయనగర సామ్రాజ్యం (1336-1646). శాతవాహన రాజవంశం పతనం తరువాత దక్కన్‌ను 3 వ శతాబ్దం నుండి 5 వ శతాబ్దం వరకు వాకాటక రాజవంశం పాలించింది.

6 నుండి 8 వ శతాబ్దం వరకు దక్కన్‌ను చాళుక్య రాజవంశం పాలించింది, ఇది రెండవ పులకేశి వంటి గొప్ప పాలకులను ఉత్పత్తి చేసింది, అతడు ఉత్తర భారత చక్రవర్తి హర్షుడు లేదా రెండవ విక్రమాదిత్యుడిని ఓడించాడు. 8 నుండి 10 వ శతాబ్దం వరకు రాష్ట్రకూట రాజవంశం ఈ ప్రాంతాన్ని పరిపాలించింది. ఇది ఉత్తర భారతదేశంలోకి విజయవంతంగా దండయత్ర చేసింది. అరబ్ పండితులు ప్రపంచంలోని నాలుగు గొప్ప సామ్రాజ్యాలలో దీన్ని ఒకటిగా అభివర్ణించారు.[18] 10 వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్య సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఇది సాంఘిక సంస్కర్త బసవ, విజనేశ్వర, గణిత శాస్త్రజ్ఞుడు భాస్కర II, మానసోల్లాస వచనాన్ని రాసిన సోమేశ్వర III వంటి పండితులను ఉత్పత్తి చేసింది. 11 వ శతాబ్దం ఆరంభం నుండి 12 వ శతాబ్దం వరకు దక్కన్ పీఠభూమి పశ్చిమ చాళుక్య సామ్రాజ్యం, చోళ రాజవంశం ఆధిపత్యం వహించింది.[19] రాజ రాజ చోళ I, రాజేంద్ర చోళ I, జయసింహ II, సోమేశ్వర I, విక్రమాదిత్య VI, కులోత్తుంగ I పాలనలో దక్కన్ పీఠభూమిలో పశ్చిమ చాళుక్య సామ్రాజ్యం, చోళ రాజవంశం మధ్య అనేక యుద్ధాలు జరిగాయి.[20]

హంపి వద్ద పీఠభూమి దృశ్యం

1294 లో, ఢిల్లీ చక్రవర్తి అలౌద్దీన్ ఖల్జీ దక్కన్ పై దండెత్తి, దేవగిరిపై దాడి చేసి, మహారాష్ట్రలోని యాదవ రాజాలను సామంతులుగా చేసుకున్నాడు. ఆపై దక్షిణ దిశగా ఆంధ్ర, కర్ణాట ప్రాంతాలను జయించటానికి వెళ్ళాడు. 1307 లో, మాలిక్ కాఫూర్ నేతృత్వంలోని ముస్లిం దండయాత్రలతో యాదవ శక్తి నాశనమైంది. 1338 లో సుల్తాన్ ముహమ్మద్ బిన్ తుగ్లక్ దక్కన్ విజయాన్ని పూర్తి చేసాడు. అతడి ఆధిపత్యం కొన్నాళ్ళ పాటే ఉంది, వెంటనే ఆంధ్ర, కర్ణాటకల్లో పూర్వపు రాజులు తిరిగి వచ్చారు. హిందూ రాజ్యాల తరువాత ముస్లిం సామంతులు తిరుగుబాటు చేసారు. ఫలితంగా 1347 లో స్వతంత్ర ముస్లిం రాజవంశం, బహమనీని స్థాపించారు.[21] ఢిల్లీ సుల్తానేట్ శక్తి నర్మదా నదికి దక్షిణాన ఆవిరైపోయింది. దక్షిణ దక్కన్, ప్రసిద్ధి గాంచిన విజయనగర సామ్రాజ్యం పాలనలో వచ్చింది, ఇది కృష్ణదేవరాయ చక్రవర్తి పాలనలో దాని అత్యున్నత స్థాయికి చేరుకుంది. [22] 1373 లో తమ సరిహద్దును గోల్కొండకు, 1421 లో వరంగల్‌కు, 1472 లో బంగాళాఖాతానికి విస్తరించిన బహమనీ రాజవంశానికి కర్ణాటక హిందూ రాజ్యం కొంచెం కొంచెం పడిపోతూ వచ్చింది. విజయనగర సామ్రాజ్యానికి చెందిన కృష్ణదేవరాయలు బహమనీ సుల్తానేట్లను ఓడించాడు, తరువాత బహమనీ సుల్తానేట్ కూలిపోయింది. [23] 1518 లో బహమనీ సామ్రాజ్యం కరిగిపోయినప్పుడు, దాని ఆధిపత్యాలు ఐదు ముస్లిం రాష్ట్రాలైన గోల్కొండ, బీజాపూర్, అహ్మద్ నగర్, బీదర్, బెరార్ లుగా విడిపోయింది. ఇది దక్కన్ సుల్తానేట్లకు జన్మనిచ్చింది.[21] వీటికి దక్షిణంగా, హిందూ రాజ్యమైన విజయనగర సామ్రాజ్యం అప్పటి ఇంకా మనుగడ లోనే ఉంది; కానీ ఇది కూడా, తళ్ళికోట యుద్ధంలో (1565) ముస్లిం శక్తుల కూటమి చేతిలో ఓడిపోయింది. బేరార్‌ను అప్పటికే 1572 లో అహ్మద్‌నగర్ చేజిక్కించుకుంది. బీదర్‌ను 1619 లో బీజాపూర్ ఆక్రమించుకుంది. ఈ సమయంలో దక్కన్ పట్ల మొఘలుల ఆసక్తి కూడా పెరిగింది. 1598 లో పాక్షికంగా సామ్రాజ్యంలో విలీనం చేయబడిన అహ్మద్‌నగర్‌ను 1636 లో పూర్తిగా కలిపేసుకుంది; 1686 లో బీజాపూర్, 1687 లో గోల్కొండలు కూడా మొగలు సామ్రాజ్యంలో కలిసిపోయాయి.

దక్కన్ పీఠభూమి పొడి అడవులు, అనంతగిరి

1645లో శివాజీ మరాఠా సామ్రాజ్యానికి పునాది వేశాడు. శివాజీ ఆధ్వర్యంలోని మరాఠాలు బీజాపూర్ సుల్తానేట్‌ను, చివరికి శక్తివంతమైన మొఘల్ సామ్రాజ్యాన్ని నేరుగా సవాలు చేశాడు. మరాఠా సామ్రాజ్యానికి బీజాపూర్ సుల్తానేట్ ముప్పు తొలగిపోయాక, మరాఠాలు మరింత దూకుడుగా మారారు. తరచూ మొఘల్ భూభాగంపై దాడి చేయడం ప్రారంభించారు. అయితే ఈ దాడులు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు కోపం తెప్పించాయి. 1680 నాటికి మరాఠా ఆధీనంలో ఉన్న భూభాగాలను జయించటానికి అతను తన రాజధానిని ఢిల్లీ నుండి దక్కన్ లోని ఔరంగాబాద్ కు తరలించాడు. శివాజీ మరణించిన తరువాత, అతని కుమారుడు సంభాజీ మొఘల్ దాడి నుండి మరాఠా సామ్రాజ్యాన్ని రక్షించాడు, కాని అతన్ని మొఘలులు బంధించి ఉరితీశారు. 1698 నాటికి చివరి మరాఠా కోట, జింజి పడిపోయింది. మొఘలులు, మరాఠా ఆధీనంలో ఉన్న అన్ని భూభాగాలను నియంత్రణ లోకి తెచ్చుకున్నారు.

1707 లో, చక్రవర్తి ఔరంగజేబ్ 89 సంవత్సరాల వయస్సులో అనారోగ్యంతో మరణించాడు. దీంతో మరాఠాలు తమ కోల్పోయిన భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి, ఆధునిక మహారాష్ట్రలో చాలావరకు తమ అధికారాన్ని స్థాపించడానికీ కలిసొచ్చింది. ఛత్రపతి షాహు మరణం తరువాత, పేష్వాలు 1749 నుండి 1761 వరకు సామ్రాజ్యం యొక్క వాస్తవ నాయకులు అయ్యారు, శివాజీ వారసులు సతారాలోని వారి స్థావరం నుండి నామమాత్రపు పాలకులుగా కొనసాగారు. మరాఠాలు 18 వ శతాబ్దంలో బ్రిటిష్ వారిని ముందుకు రానీకుండా నిలిపి ఉంచారు. 1760 నాటికి, దక్కన్‌లో నిజాం ఓటమితో, మరాఠా శక్తి దాని అత్యున్నత స్థాయికి చేరుకుంది. అయితే, పేష్వాకు, వారి సర్దార్లకూ మధ్య విభేదాల వలన సామ్రాజ్యం క్రమంగా పతనమైంది. చివరికి 1818 లో మూడు ఆంగ్లో-మరాఠా యుద్ధాల తరువాత, మరాఠా సామ్రాజ్యాన్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేజిక్కించుకుంది.

కొన్ని సంవత్సరాల తరువాత, అహ్మద్ నగర్ లోని ఔరంగజేబ్ ప్రతినిధి నిజాం ఉల్ ముల్క్, 1724 లో హైదరాబాదులో స్వంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మైసూర్‌ను హైదర్ అలీ పాలించేవాడు. 18 వ శతాబ్దం మధ్యకాలం నుండి పీఠభూమిలోని శక్తుల మధ్య జరిగిన ఆధిపత్యపోటీల సమయంలో, ఫ్రెంచ్, బ్రిటిష్ వారు ప్రత్యర్థి శిబిరాల్లో చేరేవారు. కొన్నాళ్ళ పాటు విజయాలు చూసిన తరువాత, ఫ్రాన్స్ ప్రాబల్యం తగ్గి, బ్రిటిషు వారు భారతదేశంలో కొత్త సామ్రాజ్యాన్ని స్థాపించారు. మైసూరు, దక్కన్లో వారి తొలి విజయాలలో ఒకటి అయింది. తంజోర్, కర్ణాట ప్రాంతాలను త్వరలోనే వారి స్వాధీనమయ్యాయి. తరువాత 1818 లో పేష్వా భూభాగాలు చేర్చుకున్నారు.

బ్రిటిష్ ఇండియాలో, పీఠభూమి ఎక్కువగా బొంబాయి, మద్రాస్ ప్రెసిడెన్సీలలో విభజించబడి ఉండేది. ఆ సమయంలో రెండు అతిపెద్ద స్థానిక రాజ్యాలు హైదరాబాద్, మైసూర్‌లు కాగా, కొల్లాపూర్, సావంత్వారితో సహా చాలా చిన్న రాజ్యాలు చలానే ఉండేవి.

1947 లో స్వాతంత్ర్యం తరువాత, దాదాపు అన్ని స్థానిక రాష్ట్రాలు రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో చేరాయి. హైదరాబాదు చేరడానికి నిరాకరించడంతో 1948 లో ఆపరేషన్ పోలో జరిపి భారత సైన్యం హైదరాబాద్‌ను ఆక్రమించింది.[24] 1956 లో, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం భాషా పరంగా రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించి, ప్రస్తుతం పీఠభూమిలో ఉన్న రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి.

ఇవీ చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Page 46, Dr. Jadoan, Atar Singh. Military Geography of South-East Asia. India: Anmol Publications Pvt. Ltd. pp. 270 pages. ISBN 8126110082. Retrieved 2008-06-08.
  2. 2.0 2.1 "The Deccan Peninsula". sanctuaryasia. Archived from the original on 2012-04-23. Retrieved 2007-01-05.
  3. 3.0 3.1 "The Deccan Plateau". rainwaterharvesting.org. Retrieved 2007-01-05.
  4. "Monier-Williams Sanskrit English Dictionary Page 0498". www.ibiblio.org. Retrieved 2023-01-20.
  5. Henry Yule, A. C. Burnell. Hobson-Jobson: The Definitive Glossary of British India. Oxford. ISBN 9780191645839.
  6. "Monier-Williams Sanskrit English Dictionary Page 0498". www.ibiblio.org. Retrieved 2023-01-20.
  7. "నిఘంటుశోధన - తెలుగు నిఘంటువు Online Telugu Dictionary - Andhrabharati nighaMTu SOdhana - ఆంధ్రభారతి నిఘంటు శోధన Telugu Dictionary Online Telugu Dictionary telugu nighantuvu Telugu Online Dictionaries telugunighantuvu తెలుగునిఘంటువు telugunighantuvulu తెలుగునిఘంటువులు శబ్దరత్నాకరము శ్రీసూర్యరాయాంధ్ర నిఘంటువు బ్రౌన్ నిఘంటువు ఆంధ్ర వాచస్పత్యము వావిళ్ల నిఘంటువు వావిళ్ళ నిఘంటువు తెలుగు వ్యుత్పత్తి కోశము తెలుగు వ్యుత్పత్తి కోశం శబ్దార్థ చంద్రిక ఆంధ్ర దీపిక శ్రీ సూర్యరాయ నిఘంటువు Telugu Nighantuvu Nigantuvu Bahujanapalli Sitaramacharyulu Sabdaratnakaram Sabdaratnakaramu Shabdaratnakaram Shabdaratnakaramu Sabda ratnakaramu Shabda ratnakaramu Charles Philip Brown Telugu-English Dictionary, English-Telugu Dictionary Adhunika vyavaharakosamu Shabdaratnakaramu, Urdu Telugu Dictionary". andhrabharati.com. Retrieved 2023-01-20.
  8. 8.0 8.1 S. M. Alam 2011, p. 311.
  9. 9.0 9.1 Richard M. Eaton 2005, p. 2.
  10. S. M. Alam 2011, p. 312.
  11. Stewart Gordon (1993). The Marathas 1600-1818. The New Cambridge History of India. Cambridge University Press. p. 10. ISBN 978-0-521-26883-7.
  12. మూస:NatGeo ecoregion
  13. మూస:WWF ecoregion
  14. "The Deccan Peninsula". sanctuaryasia. Archived from the original on 2012-04-23. Retrieved 2007-01-05.
  15. "Eastern Deccan Plateau Moist Forests". World Wildlife Fund. Retrieved 2007-01-05.
  16. Chisholm, Hugh, ed. (1911). "India" . ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా (in ఇంగ్లీష్). Vol. 14 (11th ed.). Cambridge University Press. pp. 375–421.
  17. History of Asia by B.V. Rao p.288
  18. Portraits of a Nation: History of Ancient India by kamlesh kapur p.584-585
  19. The Penguin History of Early India: From the Origins to AD 1300 by Romila Thapar: p.365-366
  20. Ancient Indian History and Civilization by Sailendra Nath Sen: p.383-384
  21. 21.0 21.1 Marshall Cavendish Corporation (2008). India and Its Neighbors, Part 1, p. 335. Tarreytown, New York: Marshall Cavendish Corporation.
  22. Richard M. Eaton 2005, p. 83.
  23. Richard M. Eaton 2005, p. 88.
  24. Benichou, Lucien D. (2000). From Autocracy to Integration: Political Developments in Hyderabad State (1938–1948), p. 232. Chennai: Orient Longman Limited.