భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ

వికీపీడియా నుండి
(ఇస్రో నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఇస్రో లోగోలో పైకి గురి పెట్టిన బాణం గుర్తు రాకెట్టును, అటూ ఇటూ ఉన్న సౌర ఫలకాలు ఉపగ్రహాన్నీ సూచిస్తాయి.

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ అంతరిక్ష పరిశోధనల కోసం భారత ప్రభుత్వం నెలకొల్పిన సంస్థ. ఇస్రోగా (ISRO) ప్రసిద్ధమైన ఈ సంస్థ దేశాభివృద్ధి లక్ష్యంగా అంతరిక్ష విజ్ఞానాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఏర్పాటై ప్రస్తుతం ప్రపంచంలోని అగ్రగామి అంతరిక్ష రంగ సంస్థల్లో ఒకటిగా పేరొందింది. బెంగుళూరు కేంద్రంగా ఏర్పాటైన ఇస్రోకు, దేశంలోని వివిధ ప్రదేశాల్లో పరిశోధన, అభివృద్ధి సౌకర్యాలు ఉన్నాయి.

చరిత్ర[మార్చు]

1947లో స్వాతంత్ర్యం వచ్చినపుడు భౌగోళికంగా చాలా పెద్దదయిన భారతదేశానికి రక్షణ అవసరాలు, అభివృద్ధికి అంతరిక్ష పరిజ్ఞానం యొక్క అవసరాన్ని గ్రహించి భారత ప్రభుత్వం అంతరిక్ష పరిశోధనా వ్యవస్థను ఏర్పరచేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది.

విక్రం సారాభాయ్ను భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు పితామహుడిగా అభివర్ణిస్తారు. 1957లో రష్యా మొట్టమొదటి శాటిలైట్ అయిన స్పుత్నిక్‌ను ప్రయోగించినపుడు శాటిలైట్ యొక్క ఆవశ్యకతను అప్పటి ప్రధాన మంత్రి అయిన నెహ్రూకు వివరించి, 1962లో, భారత అణుశక్తి వ్యవస్థ పితామహుడయిన హోమీ భాభా పర్యవేక్షణలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ (Indian National Committee for Space Research - INCOSPAR) ను ఏర్పరచాడు.

1960-1970

ఆది నుండి ఉపగ్రహాల నిర్మాణాన్నే దృష్టిలో పెట్టుకొని దానికి అవసరమయిన భూ ఉపరితల లక్షణాలను అధ్యయనం చేసేందుకు కేరళలో త్రివేండ్రం వద్ద తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ (TERLS) నెలకొల్పి అమెరికా, రష్యాల నుండి దిగుమతి చేసుకున్న రాకెట్లను ప్రయోగిస్తూ ఉపరితలాన్ని అధ్యయం చేయడం మొదలు పెట్టారు. అనతికాలంలోనే భారతదేశం స్వదేశీయంగా పూర్తి స్థాయి రాకెట్లను తయారు చేసి, ఉపరితల అధ్యయంలో పురోగతి సాధించింది. భవిష్యత్తులో ఇతర దేశాలు ఉపగ్రహానికి అవసరమయిన అన్ని పరికరాలను అందించక పోవచ్చని గ్రహించిన విక్రం సారాభాయ్, ఉపగ్రహానికి అవసరమయిన అన్ని విడిభాగాలనూ దేశీయంగానే తయారు చేసే దిశగా తన బృందాన్ని నడిపించాడు. 1969లో ఇన్‌కోస్పార్ ఇస్రోగా రూపొందింది. 1972లో ప్రత్యేక అంతరిక్ష విభాగం ఏర్పడింది.

1970-1980

కేవలం ఉపగ్రహాలను తయారు చేయడమే కాకుండా వాటిని ప్రయోగించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండాల్సిన ఆవశ్యకతను గుర్తించిన సారాభాయ్, ఉపగ్రహ వాహకనౌక రూపకల్పన మొదలు పెట్టాడు. అలా తయారైనదే సెటిలైట్ లాంచ్ వెహికిల్ (SLV). ఇస్రో తయారుచేసిన తొలి పూర్తిస్థాయి ఉపగ్రహానికి భారత గణిత, ఖగోళ శాస్త్రవేత్త అయిన ఆర్యభట్ట పేరు పెటారు. భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్టను 1975 ఏప్రిల్ 19 న అప్పటి సోవియట్ యూనియన్ నుండి విజయవంతంగా ప్రయోగించారు.

1979 నాటికి శ్రీహరికోట నుండి ప్రయోగించిన ఎస్సెల్వీ, రెండవ దశలో ఎదురయిన సమస్య వల్ల విజయవంతం కాలేదు. లోపాలను సరిదిద్ది 1980లో విజయవంతంగా ప్రయోగించిన ఎస్సెల్వీతో రోహిణి-1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టారు. భారతదేశం నుండి ప్రయోగించిన తొట్టతొలి ఉపగ్రహంగా చరిత్రలో నిలిచిపోయింది.

1980-1990

SLV విజయంతో శాస్త్రవేత్తలు రాబోవు దశాబ్దాలలో ఉపయోగించుటకు వీలుగా Polar Satellite Launch Vehicle (PSLV) నిర్మాణాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా పరీక్షలను నిర్వహించుటకు Augmented Satellite Launch Vehicle (ASLV) నిర్మించారు. 1987లో, 1988లో చేసిన ASLV ప్రయోగాలు రెండూ విఫలమయినప్పటికీ PSLVకి ఉపయోగపడు ఎన్నో విషయాలు శాస్త్రవేత్తలు తెలుసుకొన్నారు.

1990-2000

చివరకు 1992లో ASLV ప్రయోగం విజయవంతమయింది. కానీ అప్పటికి తక్కువ బరువు ఉన్న ఉపగ్రహాలను మాత్రమే ప్రయోగించగలిగారు. 1993లో PSLV ప్రయోగం విఫలమయింది. తిరిగి 1994లో చేసిన PSLV ప్రయోగం విజయవంతమయింది. అప్పటినుండి భారత ఉపగ్రహాలకు PSLV స్థిరమయిన వేదికగా నిలిచి ప్రపంచంలోనే అతి పెద్ద ఉపగ్రహాల సమూహానికి మూలమయినదిగా, రక్షణ, విద్యా, వ్యవసాయాలకు అవసరమయిన ఎంతో పరిజ్ఞానానికి ఆధారంగా నిలిచింది.

2000 తర్వాత

2001లో మరింత శక్తి సామర్థ్యాలు కలిగిన Geosynchronous Satellite Launch Vehicle (GSLV) నిర్మాణానికి ఇస్రో శ్రీకారం చుట్టింది. దీనివల్ల 5000 కిలోగ్రాముల బరువున్న ఉపగ్రహాలను కూడా భూ స్థిర బదిలీ కక్ష్యలోకి ప్రవేశపెట్టవచ్చు. చంద్రుడి పైకి మనిషిని పంపే దిశగా కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి.

2022 ఫిబ్రవరి 14న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సి52 (PSLV-c52) ప్రయోగం విజయవంతమైంది. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష ప్రయోగశాల నుంచి వాహకనౌక ఆర్‌ఐశాట్‌-1, ఐఎన్‌ఎస్‌-2టీడీ, ఇన్‌స్పైర్‌శాట్‌-1 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లిందని ఇస్రో ఛైర్మన్‌ డాక్టర్‌ సోమనాథ్‌ ప్రకటించారు.[1]

సంస్థ నిర్మాణం, అనుబంధ కేంద్రాలు[మార్చు]

భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగపు నిర్మాణం

ఇస్రో భారత ప్రభుత్వపు అంతరిక్ష శాఖకు అనుబంధంగా ఉంది. అంతరిక్ష శాఖ ప్రధాన మంత్రి, అంతరిక్ష కమిషన్ అధీనంలో ఉంటుంది. ఇస్రో కింది విభాగాలను, సంస్థలను నిర్వహిస్తుంది:[2]

అధిపతులు[మార్చు]

ఇస్రోకు ఇప్పటి వరకు కిందివారు నేతృత్వం వహించారు

పేరు ప్రారంభం ముగింపు కాలం
విక్రమ్ సారాభాయ్ 01966 1966 01972 1972 9 సంవత్సరాలు
ఎం జి కే మీనన్ 1972 జనవరి 1972 సెప్టెంబరు 9 నెలలు
సతీష్ ధావన్ 01972 1972 01984 1984 12 సంవత్సరాలు
యు ఆర్ రావు 01984 1984 01994 1994 10 సంవత్సరాలు
కే కస్తూరి రంగన్ 01994 1994 2003 ఆగస్టు 27 9 సంవత్సరాలు
జి మాధవన్ నాయర్ 2003 సెప్టెంబరు 2009 అక్ల్టోబరు 29 6 సంవత్సరాలు
కే రాధాకృష్ణన్ 2009 అక్టోబరు 30 2014 డిసెంబరు 31 5 సంవత్సరాలు
శైలేష్ నాయక్ 2015 జనవరి 1 2015 జనవరి 12 12 రోజులు
ఎ ఎస్ కిరణ్ కుమార్ 2015 జనవరి 12 2018 జనవరి 14 3 సంవత్సరాలు
కె. శివన్ (కైలాసవడివు శివన్‌) 2018 జనవరి 15 2022 జనవరి 15 4 సంవత్సరాలు
ఎస్ సోమనాథ్ 2022 జనవరి 15 కొనసాగుతున్నాడు

ఉపగ్రహ వాహకనౌకలు[మార్చు]

భారతీయ ఉపగ్రహ వాహక నౌకలు - ఎస్‌ఎల్‌వి-3, ఏఎస్‌ఎల్‌వి, పిఎస్‌ఎల్‌వి, జిఎస్‌ఎల్‌వి, జిఎస్‌ఎల్‌వి మార్క్-3

1960, 70 ల్లో అంతర్జాతీయ రాజకీయ పరిస్థితుల కారణంగాను, ఆర్థిక కారణాల రీత్యానూ భారత్ స్వంతంగా ఉపగ్రహ వాహక నౌకల అభివృద్ధికి సంకల్పించింది. 1960 –1970 లలో సౌండింగు రాకెట్ కార్యక్రమాన్ని విజయవంతంగా అభివృద్ధి చేసింది. 1980 ల్లో ఎస్సెల్వీ-3, ఏఎస్సెల్వీ ఉద్భవించాయి. వీటితో పాటు వీటి ప్రయోగానికి అవసరమైన మౌలిక వసతులు కూడా సమకూరాయి.[4] ఈవిజయాల పునాదిపై పిఎస్‌ఎల్‌వి, జిఎస్‌ఎల్‌వి సాంకేతికతలను కూడా ఇస్రో అభివృద్ధి చేసింది.

ఉపగ్రహ వాహకనౌక (ఎస్‌ఎల్‌వి)[మార్చు]

ఎస్‌ఎల్‌వి లేదా ఎస్‌ఎల్‌వి-3 గా పిలువబడే ఉపగ్రహ వాహకనౌక 4 దశల ఘన ఇంధన చోదిత నౌక. 500 కి.మీ. ఎత్తుకు, 40 కిలోల పేలోడును తీసుకుపోగలిగే సామర్థ్యం దీనికి ఉంది.[5] దీని మొదటి ప్రయోగం 1979 లో జరగ్గా, తుది ప్రయోగం 1983 లో జరిగింది. ఈ మధ్యలో మరో రెండు ప్రయోగాలు జరిగాయి. నాలుగు ప్రయోగాల్లోనూ రెండు విజయవంతమయ్యాయి.[6] తరువాత దీని తయారీ ఆపేసారు.

సంవర్ధిత ఉపగ్రహ వాహక నౌక (ఏఎస్‌ఎల్‌వి)[మార్చు]

ఏఎస్‌ఎల్‌వి అని పిలిచే సంవర్ధిత ఉపగ్రహ వాహక నౌక, 5 దశల ఘన ఇంధన చోద్దిత వాహకనౌక. భూ నిమ్నకక్ష్యలో 150 కిలోల పేలోడును ప్రవేశపెట్టగల సామర్థ్యం దీనికి ఉంది. భూస్థిర కక్ష్యలో పేలోడును ప్రవేశపెట్టగలిగే సాంకేతికతను అభివృద్ధి చేసే క్రమంలో ఈ నౌకను అభివృద్ధి చేసారు. దీని డిజైను ఎస్‌ఎల్‌వి పై ఆధరపడి ఉంది.[7] 1987 లో తొలి ప్రయోగం జరిగింది. 1988, 1992, 1994 ల్లో ఒక్కో ప్రయోగం జరిగింది .వీటిలో రెండు విజయవంతమయ్యాయి. ఆ తరువాత దీని తయారీ ఆపేసారు.[6]

పోలార్ ఉపగ్రహ వాహక నౌక (పిఎస్‌ఎల్‌వి)[మార్చు]

భారత రిమోట్ సెంసింగ్ ఉపగ్రహాలను సౌర సమన్వయ కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు ప్రధానంగా పిఎస్‌ఎల్‌విని అభివృద్ధి చేసారు. చిన్నపాటి ఉపగ్రహాలను భూస్థిర బదిలీ కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు కూడా పిఎస్‌ఎల్‌వి ఉపయోగపడుతుంది. 2017 వరకు జరిపిన 41 పిఎస్‌ఎల్‌వి యాత్రల్లో 38 విజయవంతం కాగా 1 పాక్షికంగాను, 2 పూర్తిగానూ విఫలమయ్యాయి. ఈ గణాంకాలు పిఎస్‌ఎల్‌వి యొక్క విశ్వసనీయతను తెలియజేస్తాయి.[8][9] ఒకే ప్రయోగంలో 104 ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రక్షేపించి, 2017 ఫిబ్రవరి 15 న పిఎస్‌ఎల్‌వి ప్రపంచ రికార్డు సృష్టించింది.[10][11][12]

దశాబ్ది వారీగా పిఎస్‌ఎల్‌వి ప్రయోగ వివరాలు:

దశాబ్ది జయప్రదం పాక్షిక విజయం వైఫల్యాలు మొత్తం
1990లు 3 1 1 5
2000లు 11 0 0 11
2010లు 33 0 1 34
2020లు 10 0 0 10
మొత్తం 57 1 2 60

జియోసింక్రొనస్ ఉపగ్రహ వాహక నౌక (జిఎస్‌ఎల్‌వి)[మార్చు]

జియోసింక్రొనస్ ఉపగ్రహ వాహక నౌక (జిఎస్‌ఎల్‌వి) ఇన్శాట్ రకం సమాచార ఉపగ్రహాలను భూస్థిర బదిలీ కక్ష్యలో ప్రవేశపెట్టేందుకుగాను అభివృద్ధి చేసారు. ఇస్రో వాహకనౌకల్లో ఇది రెండవ అత్యంత బరువైన నౌక. ఇది భూనిమ్న కక్ష్యకు 5 టన్నుల ఉపగ్రహాలను చేరవేయగలదు. ఈ నౌక యొక్క చివరిదశలో క్రయోజనిక్ ఇంజను వాడారు. తొలుత క్రయోజనిక్ ఇంజన్ను రష్యా నుండి దిగుమతి చేసుకోగా తదనంతర కాలంలో ఇస్రో స్వంతంగా ఇంజన్ తయారు చేసుకుంది.

రష్యా ఇంజను వాడిన జిఎస్‌ఎల్‌వి యొక్క తొలి కూర్పు (జిఎస్‌ఎల్‌వి మార్క్ 1) 2001 లో చేసిన తొలి ప్రయోగం విఫలమైంది. 2003 లో చేసిన అభివృద్ధి ప్రయోగం విజయవంతమైంది. 2004 లో ఆపరేషనులోకి వచ్చింది.

దేశీయంగా తయారుచేసిన క్రయోజనిక్ ఇంజను అమర్చిన తొలి జిఎస్‌ఎల్‌వి మార్క్ 2 ప్రయోగం జిఎస్‌ఎల్‌వి-ఎఫ్06 విఫలమైంది. GSLV-F06 carrying GSAT-5P, failed on 25 December 2010. మొదటి దశ ప్రయాణం 64 సెకండ్లు తరువాత రాకెట్ నియంత్రణను కోల్పోవడంతో ప్రమాదమేమీ జరగకుండా దాన్ని పేల్చివేసారు.[13]

2014 జనవరి 5 న జిఎస్‌ఎల్‌వి-డి5 యాత్ర విజయవంతమై, జిశాట్-14 ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టింది. దేశీయ క్రయోజనిక్ ఇంజను (సిఈ-7.5) వాడిన తొలి విజయం ఇది. భారత్, ఈ సాంకేతికత సాధించిన ఆరవ దేశం.[14][15]

2015 ఆగస్టు 27 న జిఎస్‌ఎల్‌వి-డి6 యాత్రలో జిశాట్-6 ను భూస్థిర బదిలీ కక్ష్యలో ప్రవేశపెట్టింది.

2016 సెప్టెంబరు 8 న జిఎస్‌ఎల్‌వి-ఎఫ్05 2211 కిలోల బరువున్న ఇన్శాట్-3డిఆర్ ఉపగ్రహాన్ని భూస్థిర బదిలీ కక్ష్యలో ప్రవేశపెట్టింది. దేశీయ క్రయోజనిక్ అప్పర్ స్టేజిని వినియోగించిన తొలి ఆపరేషనల్ యాత్ర ఇది.

దశాబ్ది వారీగా జిఎస్‌ఎల్‌వి ప్రయోగ వివరాలు:

దశాబ్ది జయప్రదం పాక్షిక విజయం వైఫల్యాలు మొత్తం
2000లు 2 2 1 5
2010లు 6 0 2 8
2020లు 2 0 1 3
మొత్తం 10 2 4 16

వాహక నౌక మార్క్ 3 ( ఎల్‌విఎమ్ 3)[మార్చు]

వాహక నౌకమార్క్-3 (LVM3)ను, గతంలో జిఎస్‌ఎల్‌వి మార్క్ 3 అని పిలిచారు.ఇది ఇస్రోకు అత్యంత బరువైన రాకెట్.ఇది భారతదేశం నుండి అంతరిక్షంలోకి మానవుడిని తీసుకువెళ్లబోతోంది.దశాబ్ది వారీగా ఎల్ వి మార్క్ 3 ప్రయోగ వివరాలు:

దశాబ్ది జయప్రదం పాక్షిక విజయం వైఫల్యాలు మొత్తం
2010లు 4 0 0 4[16]
2020లు 3 0 0 3
మొత్తం 7 0 0 7

చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం(ఎస్ ఎస్ ల్ వి)[మార్చు]

పేలోడ్ సామర్థ్యం 500 kg (1,100 lb) తక్కువ భూమి కక్ష్య (500 km (310 mi)) లేదా 300 kg (660 lb) సూర్య-సమకాలిక కక్ష్య (500 km (310 mi)కి ఉపగ్రహన్ని అందించడానికి భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ అభివృద్ధి చేయబడిన చిన్న ప్రయోగ వాహనం

దశాబ్ది వారీగా ఎస్ ఎస్ ల్ వి ప్రయోగ వివరాలు:

దశాబ్ది జయప్రదం పాక్షిక విజయం వైఫల్యాలు మొత్తం
2020లు 1 0 0 1
మొత్తం 1 0 0 1

ఉపగ్రహాలు[మార్చు]

ఇన్‌శాట్ - INSAT లేదా భారత జాతీయ ఉపగ్రహ వ్యవస్థ (Indian National Satellite System) అనేది సమాచారం, వాతావరణం, ప్రసారాలు మొదలయిన బహుళ ప్రయోజనాల కోసం ఇస్రో తయారు చేసిన ఉపగ్రహాల శ్రేణి. 1983లో మొదలయిన ఇన్‌శాట్, ఆసియా-పసిఫిక్ దేశాల్లో అతిపెద్ద ఉపగ్రహాల వ్యవస్థ. ప్రస్తుతం 199 ట్రాన్స్‌పాండర్లతో భారతదేశంలోని దాదాపు అన్ని టెలివిజన్, రేడియోలకు మాధ్యమంగా ఉన్న ఈ ఉపగ్రహాలను కర్నాటకలోని హస్సన్, భోపాల్ ల నుండి అనుక్షణం పర్యవేక్షిస్తుంటారు.

ఇవి కాక IRS, అనగా Indian Remote Sensing satellites, METSAT అనగా Meteorological Satellite ఉపగ్రహాలు కూడా ప్రయోగించారు.

కొన్ని ఉపగ్రహాల వివరాలు
నింగికి ఎగస్తున్నPSLV ఉపగ్రహ వాహకం
క్రమ సంఖ్య శాటిలైట్ ప్రయోగించిన తేది
1 INSAT-1A 10 ఏప్రిల్, 1982
2 INSAT-1B 30 ఆగష్టు, 1983
3 INSAT-1C 22 జూలై, 1988
4 INSAT-1D 12 జూన్, 1990
5 INSAT-2A 10 జూలై, 1992
6 INSAT-2B 23 జూలై, 1993
7 INSAT-2C 7 డిసెంబర్, 1997
8 INSAT-2D 4 జూన్, 1997
9 INSAT-2DT అంతరిక్షంలో కొనుగోలు చేయబడినది
10 INSAT-2E 3 ఏప్రిల్, 1999
11 INSAT-3A 10 ఏప్రిల్, 2003
12 INSAT-3B 22 మే, 2000
13 INSAT-3C 24 జనవరి, 2002
14 KALPANA-1 12 సెప్టెంబర్, 2002
15 GSAT-2 8 మే, 2003
16 INSAT-3E 28 సెప్టెంబర్, 2003
17 EDUSAT 20 సెప్టెంబర్, 2004
18 INSAT-4A 22 డిసెంబర్, 2005
19 INSAT-4C 10 జూలై, 2006
20 INSAT-4B 12 మార్చి, 2007
21 INSAT-4CR 2 సెప్టెంబరు, 2007
22 GSAT-7 30 ఆగష్టు, 2013

ప్రయోగ కేంద్రాలు[మార్చు]

తుంబా[మార్చు]

కేరళలో తిరువనంతపురం సమీపాన భూ అయస్కాంత రేఖకు దగ్గరలో ఉన్న తుంబాలో 1962లో మొదటి రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని నిర్మించారు. అప్పటి శాస్త్రవేత్తలలో అబ్దుల్ కలాం ఒకరు. మొదట కేవలం రాకెట్ల ప్రయోగ కేంద్రముగా ఉన్న తుంబా నెమ్మదిగా రాకెట్లకు అవసరమయిన ప్రొపెల్లర్లు, ఇంజన్లు తయారు చేసి అమర్చగలిగి పూర్తిస్థాయి రాకెట్ నిర్మాణ కేంద్రంగా తయారయింది.

శ్రీహరి కోట[మార్చు]

భారతదేశంలో ఉపగ్రహాల ప్రయోగానికి అత్యంత అనువయిన ప్రదేశమయిన శ్రీహరికోట తిరుపతి జిల్లాలో సూళ్ళూరుపేట దగ్గర ఉంది. ఈ అంతరిక్ష కేంద్రం పేరు సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం. దీనినే షార్ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని ఉపగ్రహ ప్రయోగ కేంద్రం. ఇక్కడనుండి ఎన్నో PSLV, GSLV ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించారు. ప్రస్తుతం ఇక్కడ రెండు లాంచ్ ప్యాడ్‌లు ఉన్నాయి. ఈ రెండిటివల్ల ప్రతి ఏడాది 6 శాటిలైట్లను ప్రయోగించే వీలు ఉంది.

chandipur[మార్చు]

ఇది ఒరిస్సాలో ఉంది. శ్రీహరికోటలో ఉన్నట్లు ఇక్కడ శాటిలైట్ల ప్రయోగానికి సౌకర్యాలు లేకున్నా, దీనిని ప్రధానంగా క్షిపణులను ప్రయోగించుటకు ఉపయోగిస్తారు.

హైదరాబాదు[మార్చు]

డాక్టర్ ఏపిజె అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఓ)), తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని సైనిక క్షిపణి పరిశోధన కేంద్రం.[17]

విశిష్ట వ్యక్తులు[మార్చు]

విక్రం సారాభాయ్[మార్చు]

విక్రం సారాభాయ్

విక్రం సారాభాయ్ ఆగస్టు 12, 1919న అహ్మదాబాద్ నగరంలో ధనవంతుల కుటుంబంలో జన్మించాడు. మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన తరువాత 1940లో కాలేజీ చదువుల కోసం కేంబ్రిడ్జ్ వెళ్ళిన సారాభాయ్ రెండవ ప్రపంచ యుద్ధ కారణంగా భారతదేశం తిరిగి వచ్చాడు. కొద్ది రోజుల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగుళూరులో ప్రొఫెసరుగా పనిచేస్తున్న సర్ సి.వి.రామన్ దగ్గర రీసెర్చి స్కాలరుగా చేరి అనతి కాలంలో భౌతిక శాస్త్రాన్ని, విశ్వకిరణాలను అధ్యయం చేసి తిరిగి 1945లో కేంబ్రిడ్జ్ వెళ్ళి పీహెచ్.డీ పూర్తి చేసి 1947 లో భారతదేశానికి వచ్చాడు.

1947 నవంబర్లో అహ్మదాబాదులో భౌతిక శాస్త్ర పరిశోధనాలయం ఏర్పాటు చేయడంలో సారాభాయ్ ముఖ్యపాత్ర వహించాడు. తన పరిశోధనలతో గొప్ప శాస్త్రవేత్తగా పేరు పొందిన సారాభాయ్ 1957లో ప్రపంచంలో మొట్టమొదటి శాటిలైట్ అయిన స్పుత్నిక్ ప్రయోగం గురించి తెలుసుకొని భారత భవిష్యత్ అవసరాలకు శాటిలైట్ల అవసరం గురించి ఎంతో విషయ సేకరణ చేసి అప్పటి ప్రధానమంత్రి నెహ్రూను ఒప్పించి అంతరిక్ష పరిశోధనా విభాగాన్ని ఏర్పాటు చేయించాడు. సాంకేతిక పరిజ్ఞాన ఉపయోగాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకొని రావాలని, అప్పుడే మన దేశంలోని ఎన్నో సమస్యలను పరిష్కరించవచ్చని సారాభాయ్ తోటి శాస్త్రవేత్తలను ప్రొత్సహించేవాడు.

ఆయన ఆదర్శాలకు అనుగుణంగా ఇస్రో ఎన్నో విజయాలను సాధించి భారతదేశ ఖ్యాతిని ఇనుమడింపచేసింది. 'భారత అంతరిక్ష రంగ పితామహుడు ' అయిన విక్రం సారాభాయ్ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనను 1962లో శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డుతో, 1966లో పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది. సారాభాయ్ 1971 డిసెంబరు 30 న మరణించాడు.

సతీష్ ధావన్[మార్చు]

సతీష్ ధావన్ 25 సెప్టెంబర్, 1920న శ్రీనగర్లో జన్మించాడు. పంజాబ్ యూనివర్సిటీలో చదువుపూర్తి చేసిన తర్వాత సతీష్ ధావన్, 1947లో మిన్నియాపోలిస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ మిన్నసోటాలో, 1949లో కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాడు. భారతదేశం తిరిగి వచ్చిన అనంతరం బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో వివిధ పదవులు చేపట్టి, 1972లో ఎమ్.జి.కె. మీనన్ అనంతరం ఇస్రో ఛైర్మన్ పదవిని అలంకరించాడు. ఆ తరువాతి కాలంలో భారత అంతరిక్ష చరిత్రలో ఎన్నో గొప్ప విజయాలకు మూలకారకుడు అయ్యాడు.

సతీష్ ధావన్ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1981లో పద్మ భూషణ్ అవార్డు ప్రదానం చేసింది. 2002 జనవరి 3, న మరణించిన ఆయన స్మృత్యర్థం శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రానికి సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం అని పేరు పెట్టారు.

మాధవన్ నాయర్[మార్చు]

మాధవన్ నాయర్ అక్టోబర్ 31, 1943లో కేరళలోని తిరువనంతపురంలో జన్మించాడు. 1966లో కేరళ యూనివర్సిటీ నుండి ఎలక్ట్రానిక్స్ విభాగంలో పట్టభద్రుడయిన మాధవన్ నాయర్ ఆ తరువాత ముంబైలోని ప్రతిష్ఠాత్మక భాభా అటమిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) లో శిక్షణ పొందాడు.1967లో తుంబాలో చేరిన పిమ్మట SLV నిర్మాణంలో పనిచేసాడు. తరువాత PSLV ప్రాజెక్టు డైరక్టరుగా భారతదేశపు మొదటి ఉపగ్రహ ప్రయోగ వాహన నిర్మాణంలో కీలక పాత్ర వహించాడు.

1998లో ఆయనకు పద్మ భూషణ్ అవార్డు లభించింది. సెప్టెంబరు 2003లో మాధవన్ నాయర్ ఇస్రో ఛైర్మెన్ పదవి చేపట్టినుండి ఇస్రో మరెన్నో ఉపగ్రహలను విజయవంతంగా ప్రయోగించి విజయ పరంపరను కొనసాగిస్తున్నది.

International Academy of Astronautics (IAA) కి ప్రెసిడెంట్ గా నియమించబడ్డారు. 1960లో స్థాపించబడిన IAA కి తను ప్రథమ భారతియ ప్రెసిడెంట్.

ఇస్రో ప్రస్థానంలో మైలురాళ్ళు[మార్చు]

  • 2005 - రెండవ లాంచి ప్యాడు ఆపరేషను లోకి వచ్చింది.
  • 2008 - చంద్రయాన్
  • 2014 - మంగళ్‌యాన్ - అంగారక గ్రహాన్ని మొదటి ప్రయత్నంలోనే విజయవంతంగా చేరుకున్న ఏకైక అంతరిక్ష సంస్థ.
  • 2016 - పునర్వినియోగ లాంచి వాహనపు తొలి పరీక్షను విజయవంతంగా చేసారు
  • 2016 - ఒకే రాకెట్టుతో 20 ఉపగ్రహాల ప్రయోగం - అప్పటికి ఇది ఇస్రో రికార్డు
  • 2017 - ఒకే రాకెట్టుతో 104 ఉపగ్రహాల ప్రయోగం - ఇది ప్రపంచ రికార్డు
  • 2017 - జిఎస్‌ఎల్‌వి మార్క్ 3 ప్రయోగం విజయవంతం. దేశీయంగా అభివృద్ధి చేసిన అత్యంత శక్తివంతమైన క్రయోజెనిక్ ఇంజను విజయవంతమైంది.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "ISRO: పీఎస్‌ఎల్‌వీ-సి52 ప్రయోగం విజయవంతం". EENADU. Retrieved 2022-02-14.
  2. "DoS structure". Department of Space, Government of India. Archived from the original on 27 సెప్టెంబరు 2014. Retrieved 22 September 2014.
  3. "NEC - North Eastern Council". Necouncil.nic.in. Archived from the original on 2012-02-25. Retrieved 2013-02-08.
  4. Gupta, 1697
  5. "ISRO vehicles". Jean-Jacques Serra for TBS Satellite. Retrieved 27 January 2009.
  6. 6.0 6.1 "ISRO milestones". ISRO. Archived from the original on 14 October 2007. Retrieved 27 January 2009.
  7. "ASLV". ISRO. Archived from the original on 17 October 2007. Retrieved 27 January 2009.
  8. "ISRO's Website: ISRO's Launch Vehicle". Archived from the original on 2014-10-29. Retrieved 2017-12-20.
  9. "PSLV-C11 Successfully Launches Chandrayaan-1". Archived from the original on 25 అక్టోబరు 2008. Retrieved 20 డిసెంబరు 2017.
  10. "PSLV-C9". Indian Space Research Organisation. Archived from the original on 2 నవంబరు 2014. Retrieved 2 November 2014.
  11. Bagla, Pallava (30 April 2008). "India's growing strides in space". BBC News. Retrieved 2 November 2014.
  12. Atkinson, Nancy (28 April 2008). "10 Satellites Launched in Record Setting Mission for India (Video)". Universe Today. Retrieved 2 November 2014.
  13. "Indian space programme hit by another launch mishap". SpaceFlightNow. 25 December 2010.
  14. "GSLV-D5 – Indian cryogenic engine and stage" (PDF). Official ISRO website. Indian Space Research Organisation. Archived from the original (PDF) on 2 సెప్టెంబరు 2013. Retrieved 29 September 2014.
  15. "GSLV soars to space with Indian cryogenic engine". Spaceflight Now. 5 January 2014. Retrieved 29 September 2014.
  16. http://timesofindia.indiatimes.com/india/gslv-mk-iii-breaks-isros-jinx-of-failure-in-debut-launches/articleshow/59008331.cms
  17. "Parrikar wants private players to tap DRDO's knowledge". The Hindu. 2017-01-17. Retrieved 2022-08-31.

బయటి లింకులు[మార్చు]