శంకరాభరణం
శంకరాభరణం (1979 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | కె.విశ్వనాథ్ |
నిర్మాణం | ఏడిద నాగేశ్వరరావు |
రచన | జంధ్యాల |
తారాగణం | జె.వి.సోమయాజులు , మంజు భార్గవి, రాజ్యలక్ష్మి, చంద్రమోహన్, అల్లు రామలింగయ్య, తులసి, నిర్మలమ్మ, పుష్పకుమారి, సాక్షి రంగారావు, ఝాన్సీ, వరలక్ష్మి, అర్జా జనార్ధన రావు, డబ్బింగ్ జానకి, జిత్ మోహన్ మిత్ర, శ్రీ గోపాల్ |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, వాణి జయరాం, ఎస్.పి.శైలజ |
ఛాయాగ్రహణం | బాలు మహేంద్ర |
నిర్మాణ సంస్థ | పూర్ణోదయా క్రియేషన్స్ |
విడుదల తేదీ | 19 |
నిడివి | 143 నిమిషాలు |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
శంకరాభరణం 1979 లో కె.విశ్వనాధ్ దర్శకత్వంలో నిర్మంచబడిన సంగీత ప్రాధాన్యత గల చిత్రం. కమర్షియల్ హంగులు లేకున్నా ఘనవిజయం సాధించి శంకరాభరణం ఒక సంచలనం సృష్టించింది. 70వ దశకంలో మాస్ మసాలా చిత్రాల వెల్లువలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమా రంగానికి మేలిమలుపు అయ్యింది. అంతగా పేరులేని నటీ నటులతో రూపొందిన ఈ చిత్రం అఖండ ప్రజాదరణ సాధించటం విశేషం. ఈ చిత్రం దేశవ్యాప్తంగా శాస్త్రీయ సంగీతాభిమానుల ప్రశంశలను కూడా పొందింది. ఈ చిత్రానంతరం చిత్రదర్శకుడు కె.విశ్వనాధ్ కళా తపస్విగా పేరొందారు. గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఈ సినిమాతో మంచి ప్రఖ్యాతి పొంది తెలుగు చలనచిత్రరంగంలో స్థానం సుస్థిరం చేసుకున్నారు. శంకరాభరణం సినిమా ప్రేరణతో చాలామంది కర్ణాటక సంగీతం నేర్చుకున్నారంటే సినిమా ప్రభావం తెలుస్తోంది.ఈ చిత్రం యొక్క మొధటి చిత్రీకరణ రాజమహెంద్రవరం దగ్గరలో రఘుదేవపురం గ్రామ౦లొ, ఎక్కువ భాగం ఆ పరిసర ప్రాంతాలలో చిత్రిీకరించబడింది. త్యాగరాజ కీర్తనల్లా అనిపించే వేటూరి సుందర రామ్మూర్తి రాసిన గీతాలు పండిత పామరులను విశేషంగా అలరించాయి. అపర త్యాగరాజ స్వామిగా వేటూరికి పేరు తెచ్చి పెట్టాయి. ఇటీవలే, అనగా 2020 ఫిబ్రవరి నాటికి శంకరాభరణం సినిమా విడుదలయ్యి 40 సంవత్సరాలు పూర్తిచేసుకున్నందున తెలుగు సినిమా ప్రముఖులు కె విశ్వనాధ్ గారికి సన్మానం చేసి పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు[1].
చిత్ర కథ[మార్చు]
శంకరాభరణం శంకరశాస్త్రిగా పేరుగాంచిన శంకరశాస్త్రి (జె వి సోమయాజులు) ఒక గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయన సంగీతమంటే చెవి కోసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకానొక వేశ్య కూతురు,గొప్ప నర్తకి అయిన తులసి (మంజు భార్గవి) ఆ వృత్తిని అసహ్యించుకుంటుంది. కళలను ఆరాధించే తులసి, శంకరశాస్రిని గురుభావంతో ఆరాధిస్తుంది. ఆయన దగ్గర సంగీతం నేర్చుకోవాలని ఆశపడుతుంది. కానీ ఆమె తల్లి మాత్రం ఆ వృత్తిలోనే కొనసాగాలని పట్టుబడుతుంది. ఆమెను బలాత్కరించి శంకర శాస్త్రిని తులనాడిన ఒక విటుణ్ణి విధిలేని పరిస్థితులలో హతమారుస్తుంది తులసి. శంకర శాస్త్రి ఆమెకు అండగా నిలుస్తాడు. లాయర్ అయిన తన స్నేహితుడి సాయంతో ఆత్మరక్షణకై చంపినట్లుగా నిరూపించి తులసిని విడిపిస్తాడు.వేశ్యయైన ఆమెకు ఆశ్రయం ఇవ్వడంతో శంకరశాస్త్రిని అందరూ చిన్న చూపు చూడడం మొదలు పెడతారు. తన వల్ల శంకరశాస్త్రి నిందలు పడవలసి రావడం తట్టుకోలేని తులసి ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది.
కాలక్రమంలో పాశ్చాత్య సంగీతపు ఒరవడిలో శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరువై శంకరశాస్త్రి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటాడు. తనపై జరిగిన అత్యాచార ఫలితంగా తులసి ఒక కొడుకుకి తల్లి అవుతుంది. శంకరశాస్త్రి దగ్గర సంగీతం నేర్చుకోవడానికి నియమిస్తుంది. దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న శంకరశాస్త్రి కుటుంబాన్ని ఆయనకు తెలియకుండా ఆమె అప్పటిదాకా కూడబెట్టిన డబ్బుతో ఆదుకుంటుంది. చివరకు తన కొడుకును తన సంగీతానికి వారసుడుగా నియమించి కన్ను మూసిన శంకరశాస్త్రి పాదాల దగ్గరే ప్రాణాలు విడుస్తుంది.
పాత్రలు-పాత్రధారులు[మార్చు]
- జె.వి.సోమయాజులు - శంకరశాస్త్రి
- మంజు భార్గవి - తులసి
- రాజ్యలక్ష్మి - శంకరశాస్త్రి కూతురు
- చంద్రమోహన్
- అల్లు రామలింగయ్య
- తులసి - తులసి కొడుకు
- నిర్మలమ్మ
- పుష్పకుమారి
- సాక్షి రంగారావు
- ఝాన్సీ
- వరలక్ష్మి
- అర్జా జనార్ధన రావు
- డబ్బింగ్ జానకి
- జిత్ మోహన్ మిత్ర
- శ్రీ గోపాల్
ప్రజాదరణ పొందిన సంభాషణలు[మార్చు]
'పాశ్చాత్య సంగీత పెను తుఫానుకు రెపరెపలాడుతున్న సత్సాంప్రదాయ సంగీత జ్యోతిని ఒక్క కాపు కాయడానికి తన చేతులడ్డు పెట్టిన ఆ మహానుభావులెవరో వారికి శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను'
- సినిమా చివరలో శంకర శాస్త్రి సభికులతో చెప్పే మాట
సభకు నమస్కారం
- శంకర శాస్త్రి సభకు పరిచయం చేసుకొనే మాట. జంధ్యాల రాసిన ఈ వాక్యం ఎంత కీర్తిని పొందిందో ప్రస్తుతం దీన్ని వాడే వక్తల సంఖ్యను లెక్కిస్తే తెలుస్తుంది.
బ్రోచేవారెవరు రా... ఈ రాగలను అవహేళనగా గానం చేస్తున్న పండితుతో శాస్త్రి గారు కొపావెశం తో 'ఆకలి వేసిన బిడ్డ అమ్మా! అని ఒకలా అరుస్తాడు. నిద్రలో ఉలిక్కిపడి లేచిన పాపడు అమ్మా! అని ఒకలా అరుస్తాడు. ప్రతీ శబ్దానికి ఒక ప్రత్యేకమైన శృతి ఉంది, నాదం ఉంది. తాదాత్మ్యం పొందిన ఒక మహామనిషి గుండె లోతుల్లోంచి గంగాజలంలా పెల్లుబికిన భావమది, గీతమది. ఆధునికత పేరుతో, మిడి మిడి జ్ఞానంతో మన పూర్వీకులు మనకిచ్చిన జాతి గర్వించదగ్గ ఉత్తమోత్తమమైన సంగీతాన్ని నాశనం, అపభ్రంశం చేయకయ్యా!' అని చెప్పి వెళ్ళీపోయినతరువాత పండితుడు శిష్యురాలతో నీకేమైనా అర్థమైన్ద? అని అడుగుతాడు ఓ.. అర్ధమైంది నీకు ఏమిరాదని.....
- శాస్త్రీయ రాగాలను అవహేళన చేస్తున్న ఒక పండితునికి శంకర శాస్త్రి బుద్ది చెప్పే తీరిది.
" ప్రతి తెలుగువాడి గుండె లోతుల్లోకి" ఈ సినిమా వెళ్ళింది అని చెప్పటనికి ఇందులోని ప్రతి పాట నిత్య యవ్వనమై సజీవంగా ఇప్పటికీ వినిపించటమే అందుకు కారణం. సంగీతం గురించి ఇప్పుడు అప్పుడు చాలాతక్కువ మందికే తెలుసు, కానీ ఈ సినిమా చూసిన తరువాత పామరుని దగ్గరనుండి సంగీత విధ్వాంశులు దాకా శభాష్ అనిపిచ్చుకున్న ఏకైక తెలుగు సంగీత చిత్రం. ఇందులో నటించిన (జీవించిన ) నటీనటులు, సాంకేతిక నిపుణులు కు, దర్శక, నిర్మాత లకు నమ:సుమాంజలీలు. మూస:వేణుగోపాల్ నండూరి
నిర్మాణం[మార్చు]
కథా చర్చలు[మార్చు]
తాయారమ్మ బంగారయ్య సినిమా విజయం తరువాత దర్శకుడు కె.విశ్వనాథ్ని కలిశాడు నిర్మాత ఏడిద నాగేశ్వరరావు. నాగేశ్వరరావుకి అంతకుముందు ఇచ్చిన మాట ప్రకారం అతడితో సినిమా చెయ్యడానికి పూనుకున్నాడు విశ్వనాథ్. అలా, శాస్త్రీయ సంగీతపు ఔన్నత్యాన్ని తెలిపే అంశంతో తను అనుకున్న కథను రచయిత జంధ్యాలతో కలిసి తయారు చేశాడు విశ్వనాథ్. నాగేశ్వరరావుకి ఇంటర్వెల్ నచ్చి క్లైమాక్స్ నచ్చకపోవడంతో మళ్ళీ కథాచర్చలు నిర్వహించి చివరకు దానికి శంకరాభరణం అని పేరు పెట్టారు. అయితే, ప్రసిద్ధ వీణా విద్వాంసుడైన ఈమని శంకరశాస్త్రికి శంకరాభరణం రాగమంటే ఇష్టమనే విషయం అందరికీ తెలిసినదే కావడంతో అతడి జీవితకథతోనే సినిమా తీస్తున్నారని అందరూ అనుకున్నారు.[2]
నటీనటుల ఎంపిక[మార్చు]
విజ్ఞానం, గాంభీర్యం, చిరు కోపం లాంటి లక్షణాలు కలిగిన శంకరశాస్త్రి పాత్రకు తొలుత అక్కినేని నాగేశ్వరరావు, శివాజీగణేశన్ లను అనుకున్నారు. కానీ వారిని సంప్రదించలేదు. ఆ తరువాత కృష్ణంరాజుకు కథను వినిపించారు. అయితే, ఆ పాత్ర తనకు కొత్తని, దాన్ని ప్రేక్షకులు అంగీకరించకపోతే దాని ప్రయోజనం దెబ్బతింటుందని కృష్ణంరాజు తిరస్కరించాడు. చివరకు ఆ పాత్రకు ఓ కొత్త నటుడిని ఎంపిక చేయాలన్న దర్శకుడు విశ్వనాథ్ ఆలోచనను సమర్థించాడు నిర్మాత నాగేశ్వరరావు.[2] ఆ విషయమై వారిద్దరినీ తమ సన్నిహితులు వారించినా వారు తమ నిర్ణయం వైపే మొగ్గు చూపారు. ఆ క్రమంలో తనతో కలిసి ఒకప్పుడు నాటకాలు వేసిన జె.వి.సోమయాజులు గురించి విశ్వనాధ్ తో చెప్పాడు నాగేశ్వరరావు. అందుకు గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కూడా సమర్థించాడు.[3]
పాటలు[మార్చు]
ఈ చిత్రం లోని అన్నిపాటలకు సంగీతం అందించినవారు: కే వి మహదేవన్.
పాటలు | ||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|
సంఖ్య. | పాట | సాహిత్యం | గానం | నిడివి | ||||||
1. | "ఏ తీరుగ నను దయ చూచెదవో" | శ్రీ భక్త రామదాసు | వాణీ జయరాం | |||||||
2. | "ఓంకారనాదాను సంధానమౌ గానమే శంకరాభరణము" | వేటూరి సుందరరామ్మూర్తి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం٫ ఎస్. జానకి | |||||||
3. | "దొరకునా ఇటువంటి సేవ" | వేటూరి సుందరరామ్మూర్తి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాం | |||||||
4. | "పలుకే బంగారమాయెనా" | శ్రీ భక్త రామదాసు | వాణీ జయరాం | |||||||
5. | "బ్రోచేవారెవరురా" | శ్రీ మైసూరు వాసుదేవాచార్యులు | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాం | |||||||
6. | "మాణిక్య వీణాముపలాలయంతి" (పద్యం) | మహాకవి కాళిదాసు | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | |||||||
7. | "మానస సంచరరే" | శ్రీ సదాశివ బ్రహ్మేంద్రియస్వామి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాం | |||||||
8. | "రాగం తానం పల్లవి" | వేటూరి సుందరరామ్మూర్తి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | |||||||
9. | "శంకరా నాదశరీరాపరా" | వేటూరి సుందరరామ్మూర్తి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | |||||||
10. | "సామజ వరగమన" | వేటూరి సుందరరామ్మూర్తి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి |
బహుమతులు[మార్చు]
సంవత్సరం | ప్రతిపాదించిన విభాగం | పురస్కారం | ఫలితం |
---|---|---|---|
1979 | కె విశ్వనాధ్ | జాతీయ చిత్ర బహుమతులు - సర్వోత్తమ సర్వమనొరంజక చిత్రము (స్వర్ణ పద్మము) | విజేత |
కె వి మహదేవన్ | జాతీయ చిత్ర బహుమతులు - ఉత్తమ సంగీతదర్శకులు | విజేత | |
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం | జాతీయ చిత్ర బహుమతులు - ఉత్తమ నేపథ్య గాయకుడు | విజేత | |
వాణి జయరాం | జాతీయ చిత్ర బహుమతులు - ఉత్తమ నేపథ్య గాయని | విజేత | |
కె వి మహదేవన్ | నంది ఉత్తమ చిత్రాలు - స్వర్ణ నంది | విజేత | |
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం | నంది ఉత్తమ నేపథ్య గాయకుడు | విజేత | |
వాణి జయరాం | నంది ఉత్తమ నేపథ్య గాయని | విజేత | |
కె వి మహదేవన్ | నంది ఉత్తమ సంగీతదర్శకులు | విజేత | |
వేటూరి సుందరరామమూర్తి (శంకరా నాదశరీరాపరా పాటకు) |
నంది ఉత్తమ గీత రచయిత | విజేత | |
1980 | జె వి సోమయాజులు | ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటుడు బహుమతి - తెలుగు | విజేత |
ఆధార గ్రంథాలు[మార్చు]
పులగం చిన్నారాయణ (2009). సినీ పూర్ణోదయం. హైదరాబాద్: క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్.
బయటి లింకులు[మార్చు]
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో శంకరాభరణం
- శంకరాభరణం - గురించి idlebrain.com లో రివ్యూ.
- రాగలహరిలో శంకరాభరణం పాటలు.
- "విజన్ ఆఫ్ ఇండియా" విభాగంలో శంకరాభరణం ఎన్నిక[permanent dead link]
- ↑ Team, TV9 Telugu Web (2020-02-18). "Sankarabharanam movie team felicitated in Hyderabad for 40 years memory- 'శంకరాభరణం' ఓ ఆణిముత్యం.. ఇలాంటి సినిమాలు మళ్లీ రావు". TV9 Telugu (in ఇంగ్లీష్). Retrieved 2020-02-23.
- ↑ 2.0 2.1 సినీ పూర్ణోదయం 2009, p. 61శంకరాభరణం
- ↑ సినీ పూర్ణోదయం 2009, p. 62శంకరాభరణం
- 1979 తెలుగు సినిమాలు
- All articles with dead external links
- Articles with dead external links from జనవరి 2020
- Articles with permanently dead external links
- నంది ఉత్తమ చిత్రాలు
- తెలుగు సంగీతభరితమైన చిత్రాలు
- కె.వి.మహదేవన్ సంగీతం కూర్చిన సినిమాలు
- కె. విశ్వనాధ్ సినిమాలు
- అల్లు రామలింగయ్య నటించిన చిత్రాలు
- పుష్పకుమారి నటించిన సినిమాలు
- CS1 ఇంగ్లీష్-language sources (en)
- Harv and Sfn no-target errors