Jump to content

పెడన

పెడన
పెడన is located in ఆంధ్రప్రదేశ్
పెడన
పెడన
Location in Andhra Pradesh, India
Coordinates: 16°16′00″N 81°10′00″E / 16.2667°N 81.1667°E / 16.2667; 81.1667
దేశంభారత దేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకృష్ణా జిల్లా
మండలంపెడన మండలం
Government
  ChairmanBandaru Ananda Prasad (YSR Congress Party)
Area
  Total
20.72 కి.మీ2 (8.00 చ. మై)
Elevation
0 మీ (0 అ.)
Population
 (2011)[3][4]
  Total
30,721
  Density1,500/కి.మీ2 (3,800/చ. మై.)
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
521 366
Vehicle registrationAP 16

పెడన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాకు చెందిన పట్టణం.పెడన మండలానికి, పెడన పురపాలక సంఘానికి ఇది పరిపాలనా కేంద్రం.ఇది సముద్రమట్టానికి 8 మీ.ఎత్తులో ఉంది.

గణాంకాలు

[మార్చు]

పెడన పట్టణం 17 వార్డులుగా విభజించబడింది.దీని మునిసిపల్ కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తారు. 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం పెడన మున్సిపాలిటీలో 30,721 జనాభా ఉంది, అందులో 15,083 మంది పురుషులు, 15,638 మంది మహిళలు ఉన్నారు.

0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 3037, ఇది పెడన మున్సిపాలిటీ మొత్తం జనాభాలో 9.89%. పెడన మున్సిపాలిటీలో, స్త్రీ లింగ నిష్పత్తి రాష్ట్ర సగటు 993కి వ్యతిరేకంగా 1037గా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు 939తో పోలిస్తే పెడనలో పిల్లల లింగ నిష్పత్తి దాదాపు 1040. పెడన పట్టణ అక్షరాస్యత రాష్ట్ర సగటు 67.02% కంటే 70.58% ఎక్కువ. పెడనలో పురుషుల అక్షరాస్యత దాదాపు 75.91% కాగా స్త్రీల అక్షరాస్యత రేటు 65.43 %గా ఉంది.

పెడన మునిసిపాలిటీ పరిధిలో మొత్తం 8,664 ఇళ్లకు పరిపాలన ఉంది. వీటికి నీటి సరఫరా, మురుగునీటి పారుదుల వంటి ప్రాథమిక సౌకర్యాలను స్థానిక స్వపరిపాలన సంస్థ అందిస్తుంది. మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు నిర్మించడానికి, దాని పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్నులు విధించడానికి దీనికి అధికారం ఉంది.[5]

సమీప పట్టణాలు

[మార్చు]

మచిలీపట్నం, గుడివాడ, బంటుమిల్లి, గుడ్లవల్లేరు, వడ్లమన్నాడు, నడుపూరు,కౌతవరం

రవాణా సౌకర్యాలు

[మార్చు]

పెడన పట్టణానికి 8 కి.మీ. దగ్గరలో ఉన్న పట్టణం మచిలీపట్నం (బందరు) నుండి పెడనకు విస్తృతంగా రవాణా సౌకర్యాలు ఉన్నాయి.

రైలు వసతి

[మార్చు]

పెడన పట్టణానికి, మచిలీపట్నం నుండి రోడ్దు రవాణా సౌకర్యం ఉంది. విజయవాడ రైల్వేస్టేషన్:- 68 కి.మీ.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

పెడన పట్టణంలో ముందుగా చెప్పుకోవాల్సిన స్కూళ్ళు రెండు ఉన్నాయి. అందులో ఒకటి బంగ్లాస్కూల్ గా ప్రసిద్ధి పొందిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల. ఇక్కడ 7వ తరగతి వరకూ విద్యాబోధన ఉంది. గతంలో ఈ స్కూల్ ఎంతో ప్రసిద్ధి పొందింది. బ్రిటీషర్ల బంగ్లాలో ఈ స్కూల్ ను ఏర్పాటు చేయడం వలన దీనికి బంగ్లాస్కూల్ అనే పేరు స్థిరపడింది. ప్రస్తుతం బ్రిటీషర్ల బంగ్లా లేదు. కానీ ఈ స్కూల్ మాత్రం ఆ పేరుతోనే నడుస్తోంది. ఒకప్పుడు అద్భుతమైన విద్యాబోధనకు ఈ స్కూల్ పెట్టింది పేరు. పెడనలో ప్రాథమిక విద్యను అభ్యసించినవాందరూ ఈ స్కూల్లోనే చదువుకుని ఉండేవారు. ఇక మరో విద్యాసంస్థ భట్ట జ్ఞాన కోటయ్యజిల్లా పరిషత్ హైస్కూల్. దీనినే సంకిప్తంగా బీజీకే జడ్పీహెచ్ స్కూల్గా పిలుస్తారు. జిల్లాలలో అతిపెద్ద స్కూల్గా ఇది ప్రఖ్యాతిగాంచింది. భట్ట జ్ఞాన కోటయ్య గారనే మహానుభావుడు ఈ స్కూల్ కోసం స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. ఆ మహానుభావుడి చొరవే నేడు పెడనలో నాలుగకరాలు నేర్చుకున్నవారు కనిపిస్తున్నారు. ఎంతోమంది అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాలలో స్థిరపడ్డారు. ఇదంతా ఈ స్కూల్ మహిమే. ఇవికాక, గర్ల్స్ స్కూల్, బ్రహ్మపురం స్కూల్ పేర్లతో ప్రాథమిక పాఠశాలలు కూడా ఉన్నాయి. అలాగే ఇటీవల కాలంలో ప్రైవేటు విద్యాసంస్థలు సాయిబాబా కాన్వెంట్, విశ్వభారతి, వివేకానంద, పల్లోటి, రవీంద్రవిద్యామందిర్ తదితర ప్రైవేటు స్కూళ్ళూ ఉన్నాయి.

ఇక బొడ్డు నాగయ్య జూనియర్ కళాశాల కూడా ఉంది. ఈ కళాశాల పెడనలోని బ్రహ్మపురంలో ఏర్పాటు చేశారు. జూనియర్ కళాశాల కోసం పెడన విద్యార్థులు నిరాహారదీకలు చేసి సాధించుకున్నారు. అప్పట్లో బొడ్డువారు ఈ కళాశాలకు స్థలాన్ని ఉచితంగా ఇచ్చారు. దీనివలన పెడన నుంచి బందరు వెళ్ళి చదువుకోవాల్సిన విద్యార్థులకు ఎంతో సౌకర్యం ఒనగూరింది. కాలక్రమంలో విజయానంద డిగ్రీ కళాశాల కూడా పెడన విద్యాస్థాయిని పెంచింది.

ప్రభుత్వ కార్యాలయాలు

[మార్చు]

మండల రెవెన్యూ కార్యాలయము, మున్సిపాల్ కార్యాలయము, తంతి తపాల కార్యాలయము, ప్రభుత్వ ఆసుపత్రి, దూరవాణీ (టెలిఫోన్) కార్యాలయము, సబ్ రిజిస్త్రార్ కార్యాలయము ఇక్కడ ఉన్నాయి.

దేవాలయాలు

[మార్చు]

శ్రీ పైడమ్మతల్లి ఆలయం

[మార్చు]
  • ఇక్కడ ప్రతి సంవత్సరం పైడమ్మ సంబరాలు మార్గశిర పౌర్ణమి నాటి నుంచి పదకొండు రోజుల పాటు ఘనంగా జరుగుతాయి.
  • ఈ ఆలయంలోని అమ్మవారికి, భక్తుల విరాళాలతో ఏర్పాటుచేసిన 25 లక్షల రూపాయల విలువైన స్వర్ణ కిరీటాన్ని సమర్పించినారు.
  • ఏటా సంబరాలలో భక్తులు శిడిబండి మొక్కులు చెల్లించుకోవడం సంప్రదాయం.
  • ఆలయం పక్కనే ఉన్న చెరువును పైడమ్మ చెరువుగా పిలుస్తారు. ఇక్కడ తెప్పోత్సవం నిర్వహిస్తారు.
  • ఇటీవల ఈ ఆలయం దేవాదాయశాఖ పరిధిలోకి చేరింది.

శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ అగస్తేశ్వరస్వామివారి ఆలయం

[మార్చు]

ఇది పురాతన ఆలయం. పెడన పట్టణంలో కచ్చితంగా చూడవలసిన ఆలయం. చూడచక్కని శివలింగం ఈ ఆలయ ప్రత్యేకత.ఓ మార్మిక వాతావరణం మనల్ని ముగ్ధుల్ని చేస్తుంటుంది. శివాలయంలో స్వామివారిని చూసినకొద్దీ చూడాలనిపిస్తుంటుంది. ఈ ఆలయాన్ని పెడన ప్రజలందరూ పెద్దదేవుడి గుడిగా పిలుస్తుంటారు. ఏటా కార్తీకమాసంలో అభిషేకాలు, ప్రత్యేక దీపారాధనలతో ఆలయ ప్రాంగణం కనువిందుచేస్తుంటుంది. ఆరోజుల్లో ఈ ఆలయాన్ని చూసి తీరాల్సిందే. అలాగే స్వామివారికి జరిగే అభిషేక సేవను ఎంత చూసినా తనివితీరదు. ప్రస్తుతం ఆలయానికి పాలకమండలి ఉంది. ఈ ఆలయం కూడా దేవాదాయశాఖ పరిధిలోనే ఉంది. పెడన పట్టణానికి ఈ ఆలయం చారిత్రాత్మక గుర్తుగా చెప్పొచ్చు. పెడన బస్టాండ్ నుంచి సుమారు కిలోన్నరమీటరు దూరంలో పెడన, గుడివాడ రోడ్డును ఆనుకుని ఉంటుంది. ఆటోలు ఉంటాయి. లేదంటే ఎంచక్కగా నడిచి వెళ్ళవచ్చు.

శ్రీ శ్యామలాంబ సమేత శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం

[మార్చు]

ఇక్కడ దసరా నవ రాత్రులలో వివిధ వంశాలకు చెందిన దంపతులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, వైశాఖపౌర్ణమికి, అమ్మవారి శాంతి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించెదరు. నిజానికి గతంలో పెద్దదేవుడి గుడి, శ్యామలాంబ గుడి కలిసే ఉండేవి. వీటి మధ్య ఎటువంటి ప్రహరీగోడలు లేకపోవడం వలన చక్కగా రెండూ ఆలయాలు కలిసి కనువిందుచేస్తుండేవి. ఒక ఆలయంలోంచి మరొక ఆలయంలోకి చేరడానికి అనువుగా ఉండేది. ప్రస్తుతం పెద్దదేవుడి గుడి, శ్యామలాంబ గుడి మధ్యన పెద్ద ప్రహరీగోడ నిర్మించారు. శ్యామలాంబ ఆలయంలోంకి పడమటితాళ్లలోకి మార్గం ఉంది.

శ్రీ భద్రకాళీసమేత శ్రీ వీరభద్రస్వామివారి ఆలయం

[మార్చు]

స్థానిక బ్రహ్మపురంలోని ఈ ఆలయంలోని స్వామివారి వార్షిక ఉత్సవాలు, అంగరంగ వైభవంగా ప్రారంభమైనవి కర్ణోద్భవ వంశీకులు నిర్వహించుచున్న ఈ ఉత్సవాలు ఐదు సంవత్సరాల అనంతరం పెడన గ్రామములో జరుగుచున్నవి. ఈ సందర్భంగా కృష్ణా జిల్లాతోపాటు, ఉభయ గోదావరి జిల్లాలలో నివసించుచున్న ఆ వంశీకులు, పెక్కు సంఖ్యలో ఈ ఆలయానికి తరలి వచ్చారు. ఆలయంలో అలుగు సంబరం మొదలైనది. దీనిలో భాగంగా భక్తులు విచిత్ర వేషధారణలతో గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం వీరభద్రపురం నుండి ప్రభను ఊరేగింపుగా ఉత్సవ ప్రాంగణానికి తీసుకొని వచ్చారు. నిప్పులగుండం అనంతరం స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు. ఉత్సవాలలో గరగ నృత్యాలు, అఘోరాల వేషధారణలు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచినవి. ఉత్సవ క్రతువులో ముగింపులో భాగంగా, స్వామివారి కళ్యాణం నిర్వహించెదరు. అనంతరం భారీ అన్న సమారాధనకు కర్ణోద్భవ సంఘం ఏర్పాట్లు చేసింది. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని, పెడనలోని చేనేత, కలంకారీ పరిశ్రమలు మూడు రోజులు సెలవులు ప్రకటించినవి.

శ్రీ భద్రావతీ సమేత భావనాఋషిస్వామివారి ఆలయం

[మార్చు]

పెడన పట్టణ పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని నూతనంగా నిర్మించారు. 2014,జూన్-4న జరిగే ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా, 2014,జూన్-2, సోమవారం నాడు, ఆలయప్రాంగణంలో, ఉదయం 8 గంటలనుండి, హోమక్రతువులను నిర్వహించారు. మంగళవారం గూడా ఈ క్రతువు నిర్వహించెదరు. మంగళవారం నాడు శాంతి కుంభస్థాపన, ధాన్యాధివాసం తదితర కార్యక్రమాలు నిర్వహించెదరు. బుధవారం విగ్రహ ప్రతిష్ఠతో పాటు శాంతి కళ్యాణం, మహా కుంభాభిషేకం, మహా గణపతి, ద్వారపాలకుల ప్రతిష్ఠ, అనంతరం సమారాధన నిర్వహించెదరు.

ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా, 2015,మే-25వ తేదీ సోమవారంనాడు, ఆలయ ప్రాంగణంలో శాంతి కళ్యాణం నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో మండపారాధన, స్వామివారి ఆవిర్భావం, స్వామివారికి అభ్భిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసారు.

శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి ఆలయం

[మార్చు]

ఈ ఆలయం స్థానిక గూడూరు రహదారిపై వెలసినది.

ప్రధాన వృత్తులు

[మార్చు]

చేనేత పరిశ్రమ

[మార్చు]

ఈ గ్రామం ముఖ్యముగా చేనేత పనితో ప్రసిద్ధినొందినది. పెడన గ్రామం మధ్యస్థ పట్టణముగా ఉంటుంది. ఇక్కడ అధికులు చేయు వృత్తి చేనేత. ఇక్కడ అన్ని రకముల మగ్గములపై వివిధ రకముల నేత బట్టలు నేయగల పనివారలు కలరు. అంతర్జాతీయ ప్రసిద్ధి చెందిన కళంకారీ చేనేత వస్త్రములు ఇక్కడివే.

చేనేత ఇక్కడ ప్రముఖ పారిశ్రామిక రంగము. పెడన అనగానే గుర్తు వచ్చేది కలంకారీ కళ. ఇది వస్త్రాల పై అద్దకానికి సంబంధించిన కళ. ఈ కళను ఉపయోగించి ప్రస్తుతం లుంగీలు,చీరలు,టెబుల్ క్లాత్ లు,డోరు కర్టెన్లు, దుప్పట్లు, కర్చీఫులు వంటివి తయారు చేస్తున్నారు. ఇక్కడి నుండి దేశ, విదేశాలకు వస్త్రాలను ఎగుమతి చేస్తున్నారు. ఈ కళకు చాలా ఘనమైన చరిత్ర ఉంది. ప్రస్తుతం ఈ కళ పెడన, శ్రీకాళహస్తి వంటి కొన్ని ప్రాంతాలలో మాత్రమే సజీవంగా ఉంది. పెడన నేత వస్త్రాలకు కూడా పేరేన్నిక గన్నది. ఇక్కడ నూలుతో మెత్తటి బట్టలు తయ్యారు చేస్తారు.

మూలాలు

[మార్చు]
  1. 1 2 "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. the original (PDF) నుండి 28 January 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 January 2016.
  2. "YSR Congress Claims Three Civic Chief Posts in Krishna". The New Indian Express. Machilipatnam. 4 July 2014. the original నుండి 22 జూలై 2015 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 July 2015.
  3. "Census of India Search details". censusindia.gov.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 May 2015.
  4. "Statistical Abstract of Andhra Pradesh, 2015" (PDF). Directorate of Economics & Statistics. Government of Andhra Pradesh. p. 43. the original (PDF) నుండి 14 July 2019 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 April 2019.
  5. "Pedana Municipality City Population Census 2011-2022 | Andhra Pradesh". www.census2011.co.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-05-12.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పెడన&oldid=4090722" నుండి వెలికితీశారు