నెల్లూరు
?నెల్లూరు ఆంధ్రప్రదేశ్ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 14°26′07″N 79°58′11″E / 14.435345°N 79.969826°ECoordinates: 14°26′07″N 79°58′11″E / 14.435345°N 79.969826°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం | 13,076 కి.మీ² (5,049 చ.మై) |
దూరాలు • చెన్నై నుండి • ఒంగోలు నుండి • తిరుపతి నుండి |
• 165 కి.మీలు N (జాతీయ రహదారి) • 125 కి.మీలు S (జాతీయరహదారి) • 135 కి.మీలు E (జాతీయరహదారి) |
ముఖ్య పట్టణం | నెల్లూరు |
ప్రాంతం | కోస్తా |
జనాభా • జనసాంద్రత • పట్టణ • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
26,60,000 (2001 నాటికి) • 203/కి.మీ² (526/చ.మై) • 604000 • 1341000 • 1319000 • 65.9 • 74.45 • 57.24 |
నెల్లూరు భారతదేశం లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణతీరప్రాంతపు అయిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముఖ్య పట్టణం,[1] మండలం.ఇది నెల్లూరు లోక్సభ, నెల్లూరు శాసన సభ, నెల్లూరు గ్రామీణ శాసనసభ నియోజక వర్గాలకు కేంద్ర స్థానం కూడాను. నెల్లూరు వరి సాగుకు, ఆక్వా కల్చర్కు ప్రసిద్ధి. ఈ నగరం పెన్నా నది ఒడ్డున ఉంది. ఇక్కడ ప్రాచీనమైన శ్రీ తల్పగిరి రంగనాధస్వామి ఆలయం పెన్నా నదికి సమీపంలో ఉంది. ఇది ప్రపంచంలోనే ఉన్న మూడు రంగనాధ స్వామి దేవాలయాల్లో ఒకటి (మిగిలినవి శ్రీరంగం, శ్రీరంగపట్టణం). అంతేకాక ప్రాచీనమైన శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది. ఒకప్పుడు దీనిని విక్రమసింహపురి అని పిలువబడేది.ఇదే పేరుతో విశ్వవిద్యాలయం ఉంది. నెల్లూరుకు భారత చరిత్రలో ప్రముఖ స్థానం ఉంది. సాంస్కృతికంగా నెల్లూరు నగరం ఆంధ్రప్రదేశ్ లోని ఇతర నగరాలలో ప్రత్యేకంగా ఉంది. ఎందుకంటే తెలుగు కవులలో గొప్పవాడైన తిక్కన సోమయాజీ మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన, నివసించిన ప్రదేశం. మొదటి కవి మొల్ల కూడా ఈ ప్రదేశంలో జన్మించారు.[2] రాష్టృంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో నెల్లూరు నగరం ఒకటి. జనాభా సుమారు 6 లక్షలు.
పేరు వెనుక చరిత్ర[మార్చు]
నెల్లూరుకు విక్రమసింహపురి అనే పేరు కూడా ఉంది. విక్రమసింహ మహావీర, మనుమసిద్ధి మహారాజు సింహపురి రాజధానిగా నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలించాడు. మనుమసిద్ధి కాలంలో ఈ ప్రాంతం సస్యశ్యామలమై అత్యధిక వరి ధాన్యపు ఉత్పత్తితో విలసిల్లేది. అందుకే ఈ ప్రాంతానికి నెల్లి (తమిళ భాషలో వరి అని అర్ధం) అల్లా నెల్లివూరు అనే పేరు వచ్చింది. ఈ ప్రదేశ స్థలపురాణం, చరిత్రల ప్రకారం కాలక్రమంలో నెల్లివూరు నెల్లూరుగా రూపాంతరం చెందింది.
ఇంకో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. నెల్లూరుజిల్లా జిల్లా కేంద్రమైన నెల్లూరు పట్టణ మందు శ్రీ మూలస్థానేశ్వర ఆలయం ఉంది.ఇది చాలా ప్రాచీనమైన ఆలయం.దీనిని ఆంధ్రరెడ్డిపాలకుడైన ముక్కంటి రెడ్డిరాజుగారు కట్టించెరని ఒక కథద్వారా తెలియుచున్నది, స్థల పురాణం విషయానికొస్తే ఆ రాజుకి ఒక నాడు కలలో పరమశివుడు కనిపించి రాజా!నేను ఈ ప్రాంతమున వున్న ఉసిరిక చెట్టుమూలమున వెలసివున్నాను. నేను ఇప్పుడు భక్తకోటిని రక్షించుటకు రాదలచాను. కనుక అచట నాకొక ఆలయమును కట్టించు అని ఆజ్ఞాపించాడట.మరుసటి రోజు ఉదయమే ఆ రాజు ఉసిరిచెట్టు దగ్గరకు వెళ్లి పరిశీలించిచూడగా అచట లింగాకృతిలో వృక్షమూలమున పరమేశ్వరుడు కనపడగానే ఆనందంతో ఆ రాజు వెంటనే ఆలయాన్ని కట్టించి అందులో ఆ శివలింగమును ప్రతిష్ఠింపచేసి భక్తిప్రపత్తులతో ఆరాధించారు.ఈ ఆలయంలోని శివలింగం ఉసిరిచెట్టు మూలమున వెలసింది. ఉసిరిచెట్టును తమిళమున నెల్లి అని అంటారు. ఆనాడు తమిళభాషా ప్రభావం ఎక్కువగా వున్నందున ఆ ప్రదేశంలో ఉసిరిచెట్టు నెల్లి అని పిలిచేవారు.ఆ నెల్లిపేరు మీదుగానే అచ్చట వెలసిన గ్రామం నెల్లూరుగా ప్రఖ్యాతిగాంచిందని ప్రతీతి.
చరిత్ర[మార్చు]
ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో నెల్లూరు, ఆంధ్ర ప్రదేశ్లో ప్రముఖ విద్యా కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. పొట్టి శ్రీరాములు పేరుతో పిలవబడే నెల్లూరు జిల్లా, 1953 అక్టోబరు 1 దాకా సంయుక్త మద్రాసు రాష్ట్రం లో భాగంగా ఉంది. 1956 నవంబరు 1 న భాషాప్రయుక్తంగా రాష్ట్రాల పునర్విభజన జరిగినపుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భాగమైంది.[3] ఈ నగరం లోని మూలాపేట ప్రాంతము అత్యంత పురాతన ప్రశస్తి కలిగి ఉంది.
విశేషాలు[మార్చు]
- విజయవాడ, చెన్నై నగరాల మధ్యన నెల్లూరు ఉండటం వల్ల వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందుతున్నది.
- నెల్లూరు జిల్లా వరి సాగుకు చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతాన్ని భారతదేశ ధాన్యాగారం అని అంటారు. బంగాళా ఖాతపు తీరం వెంట చేపల, రొయ్యల పెంపకానికి (ఆక్వా కల్చర్) నెల్లూరు చాలా ప్రసిద్ధి.
- నెల్లూరు జిల్లా తీరం వెంట బకింగ్ హాం కాలువ ఉంది.
- నెల్లూరులో తెలుగు సినిమాలకు విపరీతమైన అభిమాన వర్గం ఉంది. పట్టణంలో చాలా సినిమా థియేటర్లు ఉన్నాయి. ప్రముఖ తెలుగు సినిమా నటుడు చిరంజీవి ఇక్కడే చదివాడు.నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖులు
ప్రముఖులు[మార్చు]
- పొట్టి శ్రీరాములు
- పుచ్చలపల్లి సుందరయ్య
- బెజవాడ గోపాలరెడ్డి
- ముప్పవరపు వెంకయ్యనాయుడు
- రమణా రెడ్డి
- సింగీతం శ్రీనివాసరావు
- వై.వి. రావు
- ఆచార్య ఆత్రేయ,
- శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
- శైలజ
- వాణీశ్రీ
- నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి
- నేదురుమల్లి జనార్ధనరెడ్డి
- పొంగూరు నారాయణ
- పి.పుల్లయ్య
- కుడుముల పద్మశ్రీ
- అశ్వని (నటి)
- చివుకుల ఉపేంద్ర
- పరిపూర్ణానంద స్వామి
నెల్లూరులో గ్రామాలు[మార్చు]
సాంస్కృతిక సేవా రంగాలు[మార్చు]
తెలుగు సాంస్కృతిక సేవలో నెల్లూరు పేరు గాంచింది. కవిత్రయంలోని తిక్కన మహాభారతంలోని 15 పర్వాలు ఈ ప్రదేశం లోనే రచించారు.
పరిశ్రమలు[మార్చు]
అభ్రకం ఉత్పత్తిలో అగ్రగామి. పింగాణి, ముడి ఇనుము, జిప్సం, సున్నపురాయి నిధులున్నాయి. జిల్లాలో ట్రేడింగ్ రైసు మిల్లులు, నాన్ ట్రేడింగ్ రైసు మిల్లులు, షుగర్ మిల్లులు ఉన్నాయి.
విద్యాలయాలు[మార్చు]
- విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం
- నారాయణ ఇంజనీరింగ్ కళాశాల.
- వెంకటగిరి రాజా కళాశాల.
- దొడ్ల కౌశల్యమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల.
- సర్వోదయా కళాశాల.
- ప్రభుత్వ బి.ఇ.డి కళాశాల.
- ప్రభుత్వ పాలటెక్నిక్ కళాశాల.
- వేద సంస్కృత కళాశాల.
- రత్నం కాన్సెప్ట్ స్కూల్ (గాయత్రి నగర్)
- ప్రియదర్షిని (యమ్.సి.ఎ , యమ్.బి ఎ)
- ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్
- వి.బి.అర్ రెసిడెన్షియల్ స్యూల్
- చంద్రారెడ్డి జూనియర్ కాలేజి
బ్యాంకులు[మార్చు]
ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు జిల్లాలో 91 శాఖలు కలిగి అత్యధిక బ్యాంకు శాఖలు ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకు. కేవలం నెల్లూరు నగరంలో 15 శాఖలు ఉన్నాయి. ఇంకా పలు ప్రభుత్వ, ప్రైవేటు బాంకులు కూడా ఉన్నాయి.
సినిమాథియేటర్లు[మార్చు]
పలు సినిమాహాళ్లు, మల్టిప్లెక్స్లు ఉన్నాయి. యామ్ జి బి మాల్ మల్టీప్లెక్స్ అయిదు ప్రదర్శన తెరలు కలిగివున్నది.
ఇతర సమాచారం[మార్చు]
- నెల్లూరు గ్రామ దేవత : ఇరుకళల పరమేశ్వరి
- నెల్లూరు పిన్ కోడ్ : 524001-524003
- నెల్లూరు టెలిఫోన్ యస్.టి.డి కోడ్ : 0861
- నెల్లూరు ఆర్టీసీ, రైల్వే షార్ట్ కట్ కోడ్: ఎన్ ఎల్ ఆర్
రవాణా సౌకర్యాలు[మార్చు]
నెల్లూరు నగరం చెన్నై-కోల్కత్తా జాతీయ రహదారి (NH-5) మీద చెన్నై-ఒంగోలు ల మధ్య ఉంది. ప్రస్తుతం ఈ రహదారి నాలుగు మార్గాలతో ఉంది. 2011 కల్లా ఇది ఆరు మార్గాలుగా విస్తరింపబడుతుంది. తిరుపతి, విజయవాడ, చెన్నై,హైదరాబాదు, కర్నూలు, కడప, అనంతపురం, ఒంగోలు,విశాఖపట్టణం,బెంగళూరు .. మొదలగు ప్రదేశములకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు విరివిగా ఉన్నాయి.
నెల్లూరు నగరం గూడూరు-విజయవాడ రైలు మార్గములో ప్రధాన స్టేషను. ఇక్కడ నుండి తిరుపతి, విజయవాడ, చెన్నై, హైదరాబాదు, విశాఖపట్టణం, బెంగళూరు, న్యూఢిల్లి, హౌరా, తిరువనంతపురం,కన్యాకుమారి మొదలగు ప్రదేశములకు నిత్యం రైళ్ళ రాకపోకలు ఉన్నాయి. నెల్లూరు పాతపేరైనా సింహపురి పేరు మీద సింహపురి ఎక్స్ప్రెస్ అనే సూపర్ ఫాస్ట్ రైలు గూడూరు-సికింద్రాబాద్ ల మధ్య నడుస్తుంది. నెల్లూరు సమీపంలో ఉన్న కడపకు రైల్ మర్గం లేదు కనుక నెల్లూరు నుండి కడపకు కేవలం బస్సు మార్గము మాత్రమే ఉంది.
దేవాలయాలు[మార్చు]
- నెల్లూరు జిల్లా అనేక ఆలయాలకు ప్రసిద్ధి చెందినది. వాటిలో కొన్ని అద్భుతమైనవి.
- శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయం - పెన్నా నది ఒడ్డున ఉంది. ఇది ప్రపంచంలోనే ఉన్న మూడు రంగనాధ స్వామి దేవాలయాల్లో ఒకటి (మిగిలినవి శ్రీరంగం, శ్రీరంగపట్టణం).
- శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయం, నెల్లూరు, (పూరాతన ఆలయాము)
- శ్రీ రాజరాజేశ్వరీ అమ్మవారి దెవస్థానం,దర్గామిట్ట.
- శ్రీ ధర్మరాజస్వామి ఆలయం, నెల్లూరు.
- శ్రీ వేదాంత దేశికర్ దెవస్థానం, రంగనాయకులపేట.
- భగవాన్ శ్రీశ్రీశ్రీ వెంకయ్యస్వామి గొలగమూడి
- శ్రీ కామాక్షితాయి ఆలయం, జొన్నవాడ
- శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయం, నరసింహ కొండ
- చంగాళ్లమ్మ గుడి, సూళ్లూరుపేట
- పెనుశిల నరసింహస్వామి ఆలయం, పెంచలకోన
- సోమేశ్వర స్వామి ఆలయం, సోమశిల
- జ్వాలాముఖి అమ్మవారు, నెల్లూరు జిల్లా.
- సాయిబాబా గుడి
- వినాయకుని గుడి
- కన్యకాపరమేశ్వరి ఆలయం.
- శ్రీ స్వామి అయ్యప్ప ఆలయం,దర్గామిట.
- మస్తానయ్య దర్గా నెల్లూరు
- భైరవ కోన
- ఘటిక సిద్ధేశ్వరం
- శ్రీ శ్రీ ముత్యాలమ్మతల్లి తూర్పు కనుపూరుగ్రామం
- హరిహరనాధాలయం. ఇప్పటి సంతపేటరేవు హరిహరనాధాలయం ఉన్నచోటని చరిత్రకారుల అభిప్రాయము.
పండుగలు , ఉత్సవాలు[మార్చు]
నెల్లూరులో జరుపుకొనే ముఖ్యమైన పండుగలు:
- రొట్టెల పండుగ : మొహరం పర్వదినాల్లో హిందూ ముస్లిములు కలిసి నెల్లూరు చెరువు బారా షహీద్ దర్గా వద్ద వివిధ కోర్కెలు కోరుతూ, నెరవేరిన కోర్కెల కోసం మొక్కులు తీర్చుకుంటూ రొట్టెలు ఇస్తూ పుచ్చుకుంటూ ఈ పండుగను జరుపుకుంటారు.ఈ రొట్టెల పండుగ సుమారు ఎనభై సంవత్సరాలుగా ఇక్కడజరుగుతున్నట్టు ఆధారాలు ఉన్నాయి. 1905 లో ఈ దర్గా ప్రస్తావన నెల్లూరు శాసనాలు రెండవ సంపుటం లోకనిపిస్తుంది.
- బారా షహీద్ దర్గా కథ:యుద్ధంలో పన్నెండు మంది వీరులు నెల్లూరుకు దగ్గరలో గండవరం వద్ద అమరులయ్యారు.తలలు లేని ఆ వీరుల దేహాలను గుర్రాలు ఇక్కడకు మోసుకొస్తాయి.భక్తులు ఆ ప్రదేశం లోనే వారికి సమాధులు వరుసగా నిర్మించి ఆరాధించడం మొదలెట్టారు. ఆర్కాటునవాబు ఒక సారి ఆ దర్గా వద్ద ఏదో మొక్కు మొక్కుకున్నారట. ఆయన కోరిక నెరవేరడంతో మరుసటిఏడాది దర్గాకు వచ్చి కృతజ్ఞత తెలియజేస్తూ,చెరువులో రొట్టె విడిచినట్లు ఒక కథనం. ఆ సంఘటనానంతరమే రొట్టెలపండుగ మొదలైందని పెద్దలు చెపుతుంటారు. 1930 లలో ఈ రొట్టెల పండుగ మొదలై క్రమం తప్పకుండా జరుగుతూ, స్థానిక పత్రికలలో నమోదు అయివున్నట్లు తెలుస్తుంది.మత సామరస్యంకు ప్రతీకగా జరిగే ఈ రొట్టెల పండుగలో రొట్టెలు మార్పిడి చేసుకొన్నభక్తులు జిల్లా లోని కసుమూరు,అనుమసముద్రం పేటలలోని దర్గాలను కూడా సందర్శిస్తారు. ఇంటిలో తయారు చేసుకొచ్చిన చపాతీలు (రొట్టెలు)చెరువు లోని నీళల్లో దిగి తలపై ముసుగువేసుకొని మార్పిడి చేసుకుంటారు భక్తులు.ఆరోగ్యం గురించి మొక్కు కొంటె ఫలితం కనిపిస్తే మరుసటి ఏడాది ఆరోగ్య రొట్టెకావాల్సిన వారికి పంచి మొక్కు చెల్లిస్తారు.ఇలాగే విద్యా రొట్టె, పెళ్ళి రొట్టె,సౌభాగ్య రొట్టె, సంతాన రొట్టె,వీసా రొట్టె,అభివృద్ధి రొట్టె,సమైక్యాంధ్ర రొట్టె...ఇలా ఎన్నోరకాల రొట్టెలు ఇచ్చి పుచ్చుకుంటారు .
నెల్లూరి వంటలు[మార్చు]
- నెల్లూరు చేపల పులుసు, మలైకాజ
నెల్లూరు ఒక అంతర్వేది[మార్చు]
ఇప్పటి సంతపేటరేవు హరిహరనాధాలయం ఉన్నచోటని చరిత్రకారుల అభిప్రాయము.ఈ స్వామినే తిక్కన, నాచన సోమనలు ఆరాధించారు.పెన్నానది పూర్వం ఇక్కడనే ఇంకొకపాయగాచీలి, చిత్రకూటం-ఇసుకడొంక-జేంస్ గార్డెన్-ఉదయగిరివారి తోట (ఇప్పటి లక్ష్మీపురం) నవలాకుతోటల (9 లక్షల ఫలవృక్షాలను ఇచట నెల్లూరు, సర్వేపల్లి నవాబులు పెంచినారట) మీదుగా తూర్పుగా పారి, కొత్తూరు, ఇందుకూరుసేట మడుగులై, క్రింద మొత్తలు అనే కూడలిచోట ఉత్తరముఖమై, ఊటుకూరు దగ్గర మొదటి పినాకినీ శాఖలోకలసి, సముద్రంలో సంగమించింది. దీనికి భౌగోళిక ఆధారాలున్నాయి. ఈఏటిపాయ, పేరుకొని పోతూవచ్చి ఎప్పుడు పూర్తిగా పూడిపోయిందో చెప్పలేరు. ఈ పూడిపోయిన శాఖను వృద్ధ పినాకినీ అని అంటూ, నేటికి పెద్దకారువారూఅంవాలు చూపుతారు.
పూర్వం పెన్న- ఇప్పటి రంగనాయకుల గుడికి పడమట, ఎగదలలో రెండుగా చీలి ఈ ప్రదేశానంతా ఒక అంతర్వేదిగా (Doab-దో ఆప్=రెండు నీళ్ళ పాయలు) చేసిఉన్నట్లు కనబడుచున్నది. శయన నారాయణ స్వాములు వెలసిఉన్న శ్రీరంగం, శ్రీరంగపట్నం మొదలైనవన్నీ ఇట్టి ఏటిపాయల నడిబుడ్డుననే ఉన్నాయి. జక్కన విక్రమార్క చరిత్ర, ఒక కథా సంబర్భమున ఈ దోఆబును వర్ణించి, వినికిడిగా సాగవచ్చే ఒకభౌగోళికాంశమును స్థిరీకరిస్తున్నది. జక్కన క్రీ.శ.1410 ప్రాంతంవాడు. ఈయన తాత పెద్దయామాత్యుని కాలంనుండి (క్రీ.శ.1279) ఈకవి వంశానికి నెల్లూరుతో సంబంధముంది. తిక్కభూపతి మనుమసిద్దికొడుకు. రెండవ తిక్కరాజు జక్కనకవి తాతను ఆదరించి ఉండినాడు. మల్లినాధ సూరి ఈ అదనునే సంస్కృతాంధ్ర వ్యాఖ్యానము వ్రాయించాడు.జక్కన, కవిసార్వభౌమ శ్రీనాధుని కాలమువాడు.
మూలాలు[మార్చు]
- ↑ https://www.censusindia.gov.in/2011census/dchb/2819_PART_B_DCHB_SRI%20POTTI%20SRIIAMULU%20NELLORE.pdf
- ↑ "::Nellore Municipal Corporation:: About Sri Potti Sri Ramulu Nellore". web.archive.org. 2015-11-17. Retrieved 2021-01-07.
- ↑ "History | Sri Potti Sriramulu Nellore District, Government of Andhra Pradesh | India" (in ఇంగ్లీష్). Retrieved 2021-01-07.
బయటి లింకులు[మార్చు]
![]() |
Wikimedia Commons has media related to Nellore. |
![]() |
వికీవాయేజ్ కోసం ఒక ట్రావెల్ గైడ్ ఉంది నెల్లూరు. |
- Nellore District Official Website
- 1972 భారతి మాస పత్రిక- వ్యాసము నెల్లూరులో పెన్నా నది ఒడ్డున హరిహరనాధాలయం ఉందా?- వ్యాసకర్త శ్రీ మరుపూరు కోదందరామిరెడ్డి