శక్తిపీఠాలు

శక్తిపీఠాలు, వీటిని హిందువులు, పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాథల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు అంటారు. ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. ఇవి 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అని అంటారు.
పురాణ కథ
[మార్చు]
ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు గాని కూతురినీ, అల్లుడినీ పిలవలేదు, ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయణి) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడింది. పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి? అని సతీదేవి, శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికివెళ్ళింది గాని, అక్కడ అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు.
కాని సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని (శివుని) తోడుగా దర్శనమిస్తుంది.
అష్టాదశ శక్తిపీఠాలు
[మార్చు]
అష్టాదశ శక్తిపీఠాలు ఏవి అనే విషయానికి ప్రామాణికంగా చెప్పబడే ప్రార్థనా శ్లోకం:
లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే
అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా
ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే
హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా
వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్
సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్
సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్.

ఈ శ్లోకంలో ఉన్న వివిధ స్థలాలను గుర్తించడంలో కొన్ని భేదాభిప్రాయాలున్నాయి. ఒక వివరణ ప్రకారం ఈ స్థలాలు ఇలా ఉన్నాయి
- శాంకరి - శ్రీలంక - ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు. కాని ఒక వివరణ ప్రకారం[1] ఇది దేశం తూర్పుతీరంలో ట్రిన్కోమలీలో ఉండవచ్చును. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల మందిరం నాశనమయ్యిందంటారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రం ఉంది. దగ్గరలో 'త్రికోణేశహవర స్వామి' అని పిలువబడే శివుని మందిరం ఉంది. ఆ మందిరం ప్రక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది. ట్రిన్కోమలీ నగరంలో కాళీమందిరం ప్రసిద్ధమైంది.
- కామాక్షి - కాంచీపురం, తమిళనాడు - మద్రాసు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.
- శృంఖల - ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్ - ఇది కొలకత్తాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాని ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులూ లేవు. అయితే కొలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా పరిగణింపబడుతున్నది.
- చాముండి - క్రౌంచ పట్టణం, మైసూరు, కర్ణాటక - అమ్మవారు చాముండేశ్వరీ దేవి.
- జోగులాంబ - ఆలంపూర్, తెలంగాణ - కర్నూలు నుండి 27 కిలోమీటర్ల దూరంలో 'తుంగభద్ర' & కృష్ణ నదులు కలిసే స్థలంలో ఉంది.
- భ్రమరాంబిక - శ్రీశైల క్షేత్రం, ఆంధ్ర ప్రదేశ్ - కృష్ణా నదీ తీరాన అమ్మవారు మల్లికార్జునస్వామి సమేతులై ఉంది. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో కుడా ఒకటి.
- మహాలక్ష్మి - కొల్హాపూర్, మహారాష్ట్ర - ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో చేయబడింది. అమ్మవారి తలపైన ఐదు తలల శేషుని ఛత్రం ఉంది. ప్రతి సంవత్సరం మూడు మార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి పడుతుంది.
- ఏకవీరిక - మాహుర్యం లేదా మహార్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర - ఇక్కడి అమ్మవారిని 'రేణుకా మాత'గా కొలుస్తారు. షిరిడీ నుండి ఈ మాతను దర్శించుకొనవచ్చును.
- మహాకాళి - ఉజ్జయిని, మధ్య ప్రదేశ్ - ఇదే ఒకప్పుడు అవంతీ నగరం అనబడేది. ఇది క్షిప్రా నది తీరాన ఉంది. మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళియే.
- పురుహూతిక - పీఠిక్య లేదా పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ - కుక్కుటేశ్వర స్వామి అలయమనికి 1 కిలోమీటర్ దూరం లో అమ్మవారు దర్శనం ఇస్తుంది. కాకినాడ, సామర్లకోట నుంచి 20 కిలోమీటర్ దూరం లో ఉంటుంది.
- గిరిజ - ఓఢ్య, జాజ్పూర్ నుండి 20 కిలోమీటర్లు, ఒడిషా - వైతరిణీ నది తీరాన ఉంది.
- మాణిక్యాంబ - దక్షవాటిక లేదా ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్ - కాకినాడనుండి 20 కిలోమీటర్ల దూరంలో.
- కామరూప - హరిక్షేత్రం, గౌహతి నుండి 18 కిలోమీటర్లు, అసోం - బ్రహ్మపుత్రా నది తీరంలో. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది.
- మాధవేశ్వరి - ప్రయాగ (అలహాబాదు), ఉత్తర ప్రదేశ్, త్రివేణీ సంగమం సమీపంలో - ఈ అమ్మవారిని అలోపీ దేవి అని కూడా అంటారు.
- వైష్ణవి - జ్వాలాక్షేత్రం, [2] కాంగ్రా వద్ద, హిమాచల్ ప్రదేశ్ - ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడు జ్వాలలు పురాతన కాలంనుండి వెలుగుతున్నాయి.
- మంగళ గౌరి - గయ, బీహారు - పాట్నా నుండి 74 కిలోమీటర్లు.
- విశాలాక్షి - వారాణసి, ఉత్తర ప్రదేశ్.
- సరస్వతి - జమ్ము, కాష్మీరు - అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు.
51 శక్తిపీఠాలు
[మార్చు]| సంఖ్య. | స్థలం | శరీరభాగం / ఆభరణం | శక్తి | భైరవుడు |
|---|---|---|---|---|
| 1 | హింగుళ, కరాచీ నుండి 125 కి.మీ., పాకిస్తాన్ | బ్రహ్మరంధ్రం
(శిరోభాగం) |
కొత్తారి | భీమలోచనుడు |
| 2 | షర్కారె, సుక్కార్ స్టేషనువద్ద, కరాచీ, పాకిస్తాన్ | కన్నులు | మహిషమర్దిని | క్రోధీశుడు |
| 3 | సుగంధ, షికార్ పూర్, బారిసాల్ నుండి 20 కి.మీ., బంగ్లాదేశ్ - సోంధ్ నది ఒడ్డున | ముక్కు | సునంద | త్ర్యంబకేశ్వరుడు |
| 4 | అమరనాధ్, శ్రీనగర్ నుండి 94 కి.మీ, కాష్మీర్ | గొంతు | మహామాయ | త్రిసంధ్యేశ్వరుడు |
| 5 | జ్వాలాముఖి, కాంగ్రా, పఠాన్ కోట్ వద్ద | నాలుక | సిద్ధిద (అంబిక) | ఉత్తమ భైరవుడు |
| 6 | జలంధర్ (దేవీ తాలాబ్) | ఎడమ స్తనం | త్రిపురమాలిని | భీషణుడు |
| 7 | వైద్యనాధం, దేవోగర్, ఝార్ఖండ్ | గుండె | జయదుర్గ | వైద్యనాధుడు |
| 8 | గుజ్యేశ్వరి మందిరము, పశుతినాధ మందిరం వద్ద, నేపాల్ | మోకాళ్ళు | మహాశిర | కపాలి |
| 9 | మానస, టిబెట్కు దగ్గర, కైలాసపర్వతసమీపమున మానస సరోవరంలో ఒక శిల | కుడి చేయి | దాక్షాయిని | అమరుడు |
| 10 | బిరాజా, ఒడిషా | నాభి | విమల | జగన్నాధుడు |
| 11 | ముక్తినాధ మందిరం, గండకి నది ఒడ్డున, పోఖ్రా, నేపాల్ | నుదురు | గండకీ చండి | చక్రపాణి |
| 12 | బహుళ, అజయ నదిఒడ్డున, కేతుగ్రామ్, కటువా దగ్గర, బర్ద్వాన్, పశ్చిమ బెంగాల్ | ఎడమ చేయి | బహుళా మాత | భిరుకుడు |
| 13 | ఉజ్జయిని, గుస్కురా స్టేషను, బర్ద్ వాన్, పశ్చిమ బెంగాల్ | కుడి మణికట్టు | మంగళ చండిక | కపిలాంబరుడు |
| 14 | ఉదయపూర్ వద్ద, త్రిపుర, మతబారి కొడలపైన, రాధాకిషోర్ గ్రామం | కుడి కాలు | త్రిపురసుందరి | త్రిపురేశుడు |
| 15 | ఛొట్టోగ్రామ్, చంద్రనాధ్ కొండలపైన, సీతాకుండ్ స్టేషను వద్ద, చిట్టగాంగ్ జిల్లా, బంగ్లాదేశ్ | కుడి చేయి | భవాని | చంద్రశేఖరుడు |
| 16 | త్రిస్రోత, శల్బారి గ్రామం, జల్పాయ్ గురి జిల్లా, పశ్చిమబెంగాల్ | ఎడమ కాలు | భ్రామరి | అంబరుడు |
| 17 | కామగిరి, కామాఖ్య, నీలాచలపర్వతాల వద్ద, గువహతి, అస్సాం | యోని | కామాఖ్య | ఉమానందుడు |
| 18 | జుగాద్య, ఖీర్ గ్రామ్, బర్ద్వాన్ జిల్లా, పశ్చిమబెంగాల్ | కుడి పాదం | జుగాద్య | క్షీర ఖండకుడు |
| 19 | కాళిపీఠ్, కాళీఘాట్, కొలకత్తా | కుడి బొటనవేలు | కాళిక | నకులీషుడు |
| 20 | ప్రయాగ, త్రివేణీ సంగమము, అలహాబాదు, ఉత్తర ప్రదేశ్ | కుడి వేళ్ళు | లలిత | భవుడు |
| 21 | నార్టియాంగ్ దుర్గా ఆలయం, నార్టియాంగ్, పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లా, మేఘాలయ, భారతదేశము |
ఎడమ తొడ | జయంతి | కామదీశ్వరుడు |
| 22 | కిరీటేశ్వరి ఆలయం, కిరీత్ కొండ గ్రామం, లాల్ బాగ్ కోర్ట్ స్టేషను వద్ద, ముషీరాబాద్ జిల్లా, పశ్చిమ బెంగాల్ | కిరీటము | విమల | సంవర్తుడు |
| 23 | వారాణసి (కాశి), గంగానది ఒడ్డున మణికర్ణికా ఘట్టము, ఉత్తరప్రదేశ్ | చెవిపోగు | విశాలాక్షి, మణికర్ణి | కాలభైరవుడు |
| 24 | కన్యాశ్రమము, కన్యాకుమారి, కుమారి మందిరం ప్రాంగణంలో భద్రకాళి గుడి, తమిళనాడు | వీపు | శర్వాణి | నిమీశుడు |
| 25 | కురుక్షేత్రం, హర్యానా | మడమ ఎముక | సావిత్రి | స్థాణువు |
| 26 | మణిబంధ్, పుష్కర్, గాయత్రి కొండల వద్ద, ఆజ్మీర్, రాజస్థాన్ | రెండు చేతి కడియాలు | గాయత్రి | సర్వానందుడు |
| 27 | శ్రీశైల్, జైన్ పూర్, సిల్నెట్, బంగ్లాదేశ్ | మెడ | మహాలక్ష్మి | సంబరానందుడు |
| 28 | కంచి, కొపై నది వద్ద, బోల్పూర్ స్టేషను, బీర్బమ్, పశ్చిమబెంగాల్, తారాపీఠ్ ఆలయం | ఎముక | దేవగర్భ | రురుడు |
| 29 | కల్మాధవ్, శోన్ నది ఒడ్డున కొండ గుహలో, అమరకంటక్, మధ్యప్రదేశ్ | ఎడమ పిరుదు | కాళి | అసితాంగుడు |
| 30 | షోన్ దేశ్, నర్మదా నది మూలము వద్ద, అమరకంటక్, మధ్యప్రదేశ్ | కుడి పిరుదు | నర్మద | భద్రసేనుడు |
| 31 | రామగిరి, చిత్రకూటం, ఝాన్సీ, మాణిక్ పూర్ వద్ద, ఉత్తరప్రదేశ్ | కుడి స్తనం | శివాణి | చందుడు |
| 32 | వృందావనం, భూతేశ్వర మాధవ మందిరం, ఉత్తరప్రదేశ్ | కేశాభరణం | ఉమ | భూతేశ్ |
| 33 | పద్మాక్షి రేణుక ఆలయం వద్ద, కవాడే, అలీబాగ్, మహారాష్ట్ర | ఎగువ దవడ పండు | నారాయణి | సమ్మర్ |
| 34 | పంచసాగరం (స్థలం తెలియదు) | క్రింది దవడ పండ్లు | వారాహి | మహారుద్రుడు |
| 35 | కార్తోయతాత్, భవానీపూర్ గ్రామం, సెర్పూర్, బగురా జిల్లా, బంగ్లాదేశ్ | ఎడమకాలి పట్టీ | అర్పణ | వమనుడు |
| 36 | శ్రీ పర్వతం, లడక్ వద్ద, కాశ్మీర్ర్ - (శ్రీ శైలం, ఆంధ్రప్రదేశ్ అని కూడా చెబుతారు) | కుడికాలి పట్టీ | శ్రీ సుందరి | సుందరానందుడు |
| 37 | విభాష్, తమ్లుక్ వద్ద, తూర్పు మేదినీపూర్ జిల్లా, పశ్చిమ బెంగాల్ | ఎడమ కాలి మణికట్టు | కపాలిని (భీమరూప) | సర్వానందుడు |
| 38 | ప్రభాస్, వీరవల్ స్టేషను, సోమనాధ్ మందిరం వద్ద, జునాగద్ జిల్లా, గుజరాత్ | ఉదరం | చంద్రభాగ | వక్రతుండుడు |
| 39 | భైరవ పర్వతం, శిర్పా నది ఒడ్డున, ఉజ్జయిని, మధ్య ప్రదేశ్ | పై పెదవి పైభాగం | అవంతి | లంబ కర్ణుడు |
| 40 | జనస్థానం, గోదావరీ లోయ, నాసిక్ వద్ద, మహారాష్ట్ర | చుబుకం | భ్రామరి | వికృతాక్షుడు |
| 41 | సర్వశైలం, గోదావరీ తీరం, రాజమండ్రి వద్ద, కోటిలింగేశ్వర మందిరం, ఆంధ్రప్రదేశ్ | బుగ్గలు | రాకిణి / విశ్వేశ్వరి | వత్సనాభుడు / దండపాణి |
| 42 | బిరత్, భరత్ పూర్ వద్ద, రాజస్థాన్ | ఎడమ కాలి వేళ్ళు | అంబిక | అమృతేశ్వరుడు |
| 43 | రత్నావళి, రత్నాకర నది ఒడ్డున, ఖనకుల్-కృష్ణనగర్ వద్ద, హూగ్లీ జిల్లా, పశ్చిమ బెంగాల్ | కుడి భుజం | కుమారి | శివుడు |
| 44 | మిథిల, జనక్ పూర్, భారత్-నేపాల్ సరిహద్దులో | ఎడమ భుజం | ఉమ | మహోదరుడు |
| 45 | నల్హతి, కొడపైన, బీర్భమ్ జిల్లా, పశ్చిమ బెంగాల్ | కాలి పిక్క ఎముకలు | కాళికాదేవి | యోగేశుడు |
| 46 | కర్ణాట్ (స్థలం తెలియదు) జ్ఞానాక్షి రాజరాజేశ్వరి ఆలయం | చెవులు | జయదుర్గ | అభీరుడు |
| 47 | వక్రేశ్వరి, పాపహర నది ఒడ్డున, దుబ్రాజపూర్ స్టేషను వద్ద, బీర్ భమ్ జిల్లా, పశ్చిమ బెంగాల్ | కనుబొమలు మధ్య భాగము | మహిష మర్దిని | వక్రనాధుడు |
| 48 | జెస్సోర్ (యశోరి), ఈశ్వరిపుర్ వద్ద, ఖుల్నా జిల్లా, బంగ్లాదేశ్ | చేతులు, కాళ్ళు | యశోరేశ్వరి | చందుడు |
| 49 | అత్థాస్, లాభపూర్ వద్ద, బీర్ భమ్ జిల్లా, పశ్చిమ బెంగాల్ | పెదవులు | ఫుల్లార | విశ్వేశుడు |
| 50 | నందిపూర్, సైంతియా రైల్వే స్టేషనులో ఒక మఱ్ఱి చెట్టు క్రింద, బీర్ భమ్ జిల్లా, పశ్చిమ బెంగాల్ | మెడలో హారం | నందిని | నందికేశ్వరుడు |
| 51 | లంక (ట్రిన్ కోమలి లో, హిందూమహాసాగరం తీరాన ఉన్న ఈ మందిరం శిథిలమైనదనీ, కేవలం ఒక స్తంభం మాత్రమే మిగిలి ఉన్నదనీ ఒక వివరణ) | కాలి పట్టీలు | ఇంద్రాక్షి | రాక్షసేశ్వరుడు |
శక్తి పీఠాల ఉనికి
[మార్చు]వింధ్యవాసిని శాక్త పీఠాన్ని, సతి దేవి శరీర భాగాలు అక్కడ పడకపోయినప్పటికీ, ఒక శాక్త పీఠంగా పరిగణిస్తారు. వింధ్యవాసిని దేవిని దేవతలలో అత్యున్నతమైన, పరమ స్వరూపంగా భావిస్తారు; ఆమెను ఆది పరాశక్తిగా కూడా పిలుస్తారు. వింధ్యవాసిని దేవి ఈ విశ్వంలో ఉన్న అన్ని మహావిద్యలు, నవదుర్గలు, మాత్రికలు, యోగినిలు, ఇతర అన్ని దేవతల సమష్టి రూపంగా భావించబడుతుంది; ఆమె స్వయంగా త్రిపుర సుందరిగా పరిగణించబడుతుంది.
వింధ్యవాసినితో అనేక పురాణ కథలు సంబంధించి ఉన్నాయి; ఆమెను మహాదుర్గగా కూడా పిలుస్తారు. దేవీ భాగవత పురాణం ప్రకారం పేర్కొనబడిన 108 శాక్త పీఠాలన్నిటి సంయుక్త రూపమే వింధ్యవాసిని దేవి అని విశ్వసిస్తారు. దీనికి కారణం ద్వాపర యుగంలో తన జననం అనంతరం దేవి నివసించేందుకు ఎంచుకున్న స్థలమిదే కావడం.[3]
దేవకి, వసుదేవుడులకు కృష్ణుడు జన్మించిన సమయంలో, శ్రీ విష్ణువు ఆజ్ఞ ప్రకారం వింధ్యవాసిని గోకులంలో నందుడు, యశోదలకు కుమార్తెగా జన్మించింది. కృష్ణుడు తన మేనమామైన రాక్షస రాజు కంసుడు నుండి తప్పించుకునేందుకు, వసుదేవుడు తన కుమారుడైన కృష్ణుడిని యశోదకు పుట్టిన ఈ బాలికతో మార్పిడి చేశాడు. భవిష్యత్తులో కంసుడిని కృష్ణుడే సంహరిస్తాడని ఒక ప్రవచనం ఉన్నది.
కంసుడు ఆ బాలికను చంపేందుకు ప్రయత్నించినప్పుడు, ఆమె అతని చేతుల నుండి జారి, తన అసలైన దేవీ స్వరూపాన్ని ధరించి, తనను సంహరించబోయే వాడు ఇంకా జీవించి ఉన్నాడని (అంటే కృష్ణుడు) కంసుడికి హెచ్చరిక చేసింది. అనంతరం ఆమె మథురను విడిచి, భూమిపై నివసించేందుకు వింధ్య పర్వతాలను తన నివాసస్థానంగా ఎంచుకుంది. వింధ్యవాసిని దేవి కృష్ణుని సోదరిగా కూడా విశ్వసించబడుతుంది.[3]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు, వనరులు
[మార్చు]- ↑ "దత్తపీఠం వారి వెబ్సైటులోని సమాచారం". Archived from the original on 2007-10-31. Retrieved 2007-12-06.
- ↑ "దత్తపీఠం". Archived from the original on 2007-10-31. Retrieved 2007-12-06.
- ↑ 3.0 3.1 "District Census Handbook Mirzapur" (PDF). Archived (PDF) from the original on 17 November 2020. Retrieved 12 March 2020.
బయటి లింకులు
[మార్చు]- శక్తిపీఠాలు - శక్తి పీఠాలు గురించి పూర్తి సమాచారం
- 18 శక్తి పీఠాలు ఎక్కడ ఉన్నాయో తెలిపే మాపు
- 51 శక్తి పీఠాలు ఎక్కడ ఉన్నాయో తెలిపే మాపు
- హిందూనెట్ వారి సైటు
- http://www.vedarahasya.net/docs/Shakti.pdf Archived 2017-12-09 at the Wayback Machine
- రీతి
- దత్తపీఠం
- అమ్మాస్.కమ్
- కొల్హాపూర్ మహాలక్ష్మి